- పంజగుట్ట చిన్నారిని చంపింది కన్నతల్లే
- బెంగళూరులో చంపేసి.. పంజాగుట్టలో పడేసింది
- పంజగుట్ట చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ
- కూతుర్ని కడుపులో తన్ని చంపింది
- నాన్న కావాలన్నందుకు ప్రియుడితో కలిసి దారుణం
- అదే రాత్రి ట్రావెల్స్లో డెడ్బాడీతో హైదరాబాద్కు
- షాపు ముందు పడేసి రాజస్థాన్కు..
- పదిరోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
- సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ సిగ్నళ్ల ద్వారా నిందితుల గుర్తింపు
- ఢిల్లీలో అరెస్ట్.. చంచల్గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: పంజాగుట్టలో చిన్నారి డెత్కేసు చిక్కు ముడి వీడింది. కడుపులో దాచుకోవాల్సిన కూతుర్ని కన్నతల్లే కడుపుల తన్ని పొట్టనబెట్టుకుంది. ప్రియుడి సాయంతో చిన్నారిని బెంగళూరులో చంపేసి.. హైదరాబాద్కు తీసుకొచ్చి పడేసింది. చిన్నారి డెడ్బాడీ దొరికిన చోట సీసీటీవీ ఫుటేజీలు కూడా లేకపోవడంతో సవాల్గా మారిన ఈ మిస్టరీ కేసును.. పోలీసులు అదే టెక్నాలజీ సాయంతో 10 రోజుల్లోనే ఛేదించారు. చివరకు లక్డీకాపూల్లోని ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించారు. ఫోన్ టవర్ లొకేషన్ల ఆధారంగా వారిని శుక్రవారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆ కేసు వివరాలను జాయింట్ సీపీ, వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం వెల్లడించారు.
జల్సాలకు అలవాటుపడి
మియాపూర్ న్యూ హఫీజ్పేటకు చెందిన మహ్మద్ అహ్మద్ (28), హీనా బేగం (22) దంపతులు. వీరికి కొడుకు ఆఫన్(7)తో పాటు మెహక్ (4), మహేర (3) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. అహ్మద్ చోరీలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ఓ కేసులో పోలీసులు అహ్మద్ను అరెస్ట్ చేశారు. దీంతో హీనా బేగం ఓల్డ్ సిటీలో భిక్షాటన చేసేది. తాగుడు అలవాటు ఉండడంతో ఆమె తరచూ షేక్పేటలోని ఓ కల్లు కాంపౌండ్కు వెళ్లేది. ఈ క్రమంలోనే డబీర్పుర సునార్గల్లికి చెందిన షేక్ మహ్మద్ ఖాదర్ (25) అనే ఓ హోటల్ వర్కర్తో పరిచయమైంది. అప్పట్నుంచి అతడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈజీ మనీ, జల్సాలకు బాగా అలవాటు పడిన వాళ్లిద్దరూ.. ఆఫన్, మెహక్లను తీసుకుని ముంబై వెళ్లారు. అక్కడ ఖాదర్ కొన్నాళ్లపాటు హోటల్లో పనిచేయగా.. ఆమె సెక్స్వర్క్లోకి దిగింది. తన ఇద్దరు పిల్లలతో భిక్షాటన చేయించింది. ఇలా ఐదు నెలలుగా ముంబై, ఢిల్లీ, జైపూర్, మనాలి, బెంగళూరుల్లో పిల్లలతో బెగ్గింగ్ చేయించారు. డబ్బులు తీసుకురాకుంటే చితకబాదేవారు.
స్టార్హోటళ్లలో జల్సాలు
చిన్నారులు భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు, సెక్స్వర్క్తో తాను సంపాదించిన డబ్బులను విచ్చలవిడి విలాసాలకు హీనా ఖర్చు చేసేది. అహ్మద్తో కలిసి త్రీస్టార్ హోటళ్లు, లాడ్జీల్లో జల్సాలు చేసేది. పిల్లల కళ్ల ముందే ప్రియుడితో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉంటూ భిక్షాటన చేసే తన తల్లి దగ్గర్నుంచి హీనా రూ.3 లక్షలు తీసుకుంది. ఆ డబ్బుతోనూ జల్సాలు చేసింది. ఇదే క్రమంలో బెంగళూరులో ఉండగా.. నాన్న కావాలంటూ మెహక్ మారాం చేసింది. దీంతో అడ్డుగా ఉందని భావించిన హీనా, అహ్మద్లు మెహక్ను ఈ నెల 3న చావబాదారు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా చిన్నారి కడుపులో తన్నింది హీనా. విలవిల్లాడిపోయిన చిన్నారి చనిపోయింది.
ఇక్కడ పడేసి.. జైపూర్ పరార్
మెహక్ మృతదేహాన్ని వదిలించుకునేందుకు ఘటన జరిగిన రోజు రాత్రే.. ఆఫన్ను తీసుకుని నిందితులిద్దరూ హైదరాబాద్కు వచ్చారు. ఆటోలో పంజాగుట్ట ద్వారకాపురి కాలనీకి చేరుకున్నారు. ఓ షాపు ముందు చిన్నారి మృతదేహాన్ని పడేశారు. అక్కడి నుంచి జైపూర్కు పరారయ్యారు. కలకలం రేపిన ఈ ఘటనతో పోలీసులు మిస్సింగ్, కిడ్నాప్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి వివరాలు తెలవకపోవడంతో లుకౌట్ నోటీసులిచ్చారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలు కూడా లేకపోవడంతో ఎవరు పడేశారన్నది తెలియలేదు. లక్డీకాపూల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు తీగ లాగారు. వాళ్లిద్దరూ వచ్చిన ఆటో నంబర్ను గుర్తించారు. దాదాపు 30 మంది ఆటోడ్రైవర్లను విచారించి.. లక్డీకాపూల్లో నేషనల్ ట్రావెల్స్లో బెంగళూరు నుంచి వచ్చినట్టు తేల్చారు. టికెట్ బుక్ అయిన ఫోన్ నంబర్తో దర్యాప్తు చేశారు. నిందితులు జైపూర్ వెళ్లినట్టు తేల్చారు. టవర్ లొకేషన్ ఆధారంగా ఢిల్లీ బార్డర్లోని ఓ లాడ్జ్లో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీకి వెళ్లి శుక్రవారం వాళ్లిద్దరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.