నాన్న కావాలన్నందుకు ప్రియుడితో కలిసి కూతురి మర్డర్

నాన్న కావాలన్నందుకు ప్రియుడితో కలిసి కూతురి మర్డర్
  • పంజగుట్ట చిన్నారిని చంపింది కన్నతల్లే
  • బెంగళూరులో చంపేసి.. పంజాగుట్టలో పడేసింది 
  • పంజగుట్ట చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ
  • కూతుర్ని కడుపులో తన్ని చంపింది 
  • నాన్న కావాలన్నందుకు ప్రియుడితో కలిసి దారుణం
  • అదే రాత్రి ట్రావెల్స్​లో డెడ్​బాడీతో హైదరాబాద్​కు
  • షాపు ముందు పడేసి రాజస్థాన్​కు..​
  • పదిరోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
  • సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్​ సిగ్నళ్ల ద్వారా నిందితుల గుర్తింపు
  • ఢిల్లీలో అరెస్ట్​.. చంచల్​గూడ​ జైలుకు తరలింపు

హైదరాబాద్​, వెలుగు: పంజాగుట్టలో చిన్నారి డెత్​కేసు చిక్కు ముడి వీడింది. కడుపులో దాచుకోవాల్సిన కూతుర్ని కన్నతల్లే కడుపుల తన్ని పొట్టనబెట్టుకుంది. ప్రియుడి సాయంతో చిన్నారిని బెంగళూరులో చంపేసి.. హైదరాబాద్​కు తీసుకొచ్చి పడేసింది. చిన్నారి డెడ్​బాడీ దొరికిన చోట సీసీటీవీ ఫుటేజీలు కూడా లేకపోవడంతో సవాల్​గా మారిన ఈ మిస్టరీ కేసును.. పోలీసులు అదే టెక్నాలజీ సాయంతో 10 రోజుల్లోనే ఛేదించారు. చివరకు లక్డీకాపూల్​లోని ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించారు. ఫోన్​ టవర్​ లొకేషన్ల ఆధారంగా వారిని శుక్రవారం ఢిల్లీలో అరెస్ట్​ చేశారు. ఆ కేసు వివరాలను జాయింట్​ సీపీ, వెస్ట్​జోన్​ డీసీపీ ఏఆర్​ శ్రీనివాస్​ శనివారం వెల్లడించారు. 

జల్సాలకు అలవాటుపడి
మియాపూర్​ న్యూ హఫీజ్​పేటకు చెందిన మహ్మద్​ అహ్మద్​ (28), హీనా బేగం (22) దంపతులు. వీరికి కొడుకు ఆఫన్​(7)తో పాటు మెహక్​ (4), మహేర (3) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. అహ్మద్​ చోరీలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ఓ కేసులో పోలీసులు అహ్మద్​ను అరెస్ట్​ చేశారు. దీంతో హీనా బేగం ఓల్డ్​ సిటీలో భిక్షాటన చేసేది. తాగుడు అలవాటు ఉండడంతో ఆమె తరచూ షేక్​పేటలోని ఓ కల్లు కాంపౌండ్​కు వెళ్లేది. ఈ క్రమంలోనే డబీర్​పుర సునార్​గల్లికి చెందిన షేక్​ మహ్మద్​ ఖాదర్​ (25) అనే ఓ హోటల్​ వర్కర్​తో పరిచయమైంది. అప్పట్నుంచి అతడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈజీ మనీ, జల్సాలకు బాగా అలవాటు పడిన వాళ్లిద్దరూ.. ఆఫన్​, మెహక్​లను తీసుకుని ముంబై వెళ్లారు. అక్కడ ఖాదర్​ కొన్నాళ్లపాటు హోటల్​లో పనిచేయగా.. ఆమె సెక్స్​వర్క్​లోకి దిగింది. తన ఇద్దరు పిల్లలతో భిక్షాటన చేయించింది. ఇలా ఐదు నెలలుగా ముంబై, ఢిల్లీ, జైపూర్​‌‌‌‌, మనాలి, బెంగళూరు‌‌‌‌ల్లో పిల్లలతో బెగ్గింగ్​ చేయించారు. డబ్బులు తీసుకురాకుంటే చితకబాదేవారు.  

స్టార్​హోటళ్లలో జల్సాలు
చిన్నారులు భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు, సెక్స్​వర్క్​తో తాను సంపాదించిన డబ్బులను విచ్చలవిడి విలాసాలకు హీనా ఖర్చు చేసేది. అహ్మద్​తో కలిసి త్రీస్టార్​ హోటళ్లు, లాడ్జీల్లో జల్సాలు చేసేది. పిల్లల కళ్ల ముందే ప్రియుడితో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లో ఉంటూ భిక్షాటన చేసే తన తల్లి దగ్గర్నుంచి హీనా రూ.3 లక్షలు తీసుకుంది. ఆ డబ్బుతోనూ జల్సాలు చేసింది. ఇదే క్రమంలో బెంగళూరులో ఉండగా.. నాన్న కావాలంటూ మెహక్​ మారాం చేసింది. దీంతో అడ్డుగా ఉందని భావించిన హీనా, అహ్మద్​లు మెహక్​ను ఈ నెల 3న చావబాదారు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా చిన్నారి కడుపులో తన్నింది హీనా. విలవిల్లాడిపోయిన చిన్నారి చనిపోయింది.

ఇక్కడ పడేసి.. జైపూర్​ పరార్​ 
మెహక్​ మృతదేహాన్ని వదిలించుకునేందుకు ఘటన జరిగిన రోజు రాత్రే.. ఆఫన్​ను తీసుకుని నిందితులిద్దరూ హైదరాబాద్​కు వచ్చారు. ఆటోలో పంజాగుట్ట ద్వారకాపురి కాలనీకి చేరుకున్నారు. ఓ షాపు ముందు చిన్నారి మృతదేహాన్ని పడేశారు. అక్కడి నుంచి జైపూర్​కు పరారయ్యారు. కలకలం రేపిన ఈ ఘటనతో పోలీసులు మిస్సింగ్, కిడ్నాప్​ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి వివరాలు తెలవకపోవడంతో లుకౌట్​ నోటీసులిచ్చారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలు కూడా లేకపోవడంతో ఎవరు పడేశారన్నది తెలియలేదు. లక్డీకాపూల్​లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు తీగ లాగారు. వాళ్లిద్దరూ వచ్చిన ఆటో నంబర్​ను గుర్తించారు. దాదాపు 30 మంది ఆటోడ్రైవర్లను విచారించి.. లక్డీకాపూల్​లో నేషనల్​ ట్రావెల్స్​లో బెంగళూరు నుంచి వచ్చినట్టు తేల్చారు. టికెట్​ బుక్​ అయిన ఫోన్​ నంబర్​తో దర్యాప్తు చేశారు. నిందితులు జైపూర్​ వెళ్లినట్టు తేల్చారు. టవర్​ లొకేషన్​ ఆధారంగా ఢిల్లీ బార్డర్​లోని ఓ లాడ్జ్​లో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీకి వెళ్లి శుక్రవారం వాళ్లిద్దరినీ అరెస్ట్​ చేసి తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్​ విధించడంతో చంచల్​గూడ జైలుకు తరలించారు.