నాలాలో పూడికతీత పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ సిబ్బందికి అందులో మట్టితోపాటు ఓ బైక్ బయటకు రావడంతో షాకయ్యారు. ముషీరాబాద్ డివిజన్ బాప్టిస్టు చర్చి వీధిలో జేసీబీ యంత్రాలతో కచ్చా నాలా నుంచి చెత్తను తీస్తుండగా.. అందులో హీరోహోండా ఫ్యాషన్ (AP09EE7703) బైక్ బయటకు వచ్చింది.
అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ డీఈ ప్రసాద్, ఏఈ తిరుపతిలు బైక్ ను చూసి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని పక్కకు తీసి.. ఆ బైక్ ఎవరిదనే విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. మూడు నెలలక్రితం కురిసిన భారీ వర్షాల వల్ల తన బైక్ కొట్టుకుపోయి నాలాలో పడిందని ముషీరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని, ఈ బైక్ అతనికి చెందినదేనని తెలిపారు. అతనికి కబురు చేసి బైక్ ను అందజేస్తామని చెప్పారు.