
ఢిల్లీ : సీఎం కేసీఆర్ విద్యను వ్యాపార దృక్పథంతోనే చూస్తారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని సీరియస్ అయ్యారు. జీరో అవర్ చర్చలో భాగంగా తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యల అంశాన్ని బుధవారం లోక్ సభలో ఆయన ప్రస్తావించారు. అనుభవంలేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాలు రిలీజ్ చేసే బాధ్యతను అప్పగించారన్నారు.
రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా గవర్నర్ సీఎంపై సీరియస్ అయ్యారని తెలిపారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిలా సాగుతుందని ..పెద్దింట్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు సమయం ఉండే ముఖ్యమంత్రికి.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా అని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించేంత వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని మాట్లాడారు బండి సంజయ్.