- రాష్ట్ర విభజన హామీలు అమలు చేయండి: ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని, పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని చామల డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని, దీనిపై పార్లమెంట్లో ముందుగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారం, లడఖ్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, వన్ నేషన్-వన్ ఎలక్షన్, పెట్రోల్లో ఇథనాల్ వినియోగం వంటి అంశాలపై కూడా పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కంటే దేశ ప్రజల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కు విస్తరణకు తక్షణ ఆమోదం ఇవ్వాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కృషి చేయాలని సూచించారు.
