మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఫొటోలతో కూడిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రచురించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఓటరు జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని, చాలా వార్డుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
తప్పులను సరి చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని, ఫొటోలు లేకపోవడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టమవుతుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టులను వాడుకుంటున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదన్నారు.
జూరాల సోర్స్ ఆధారంగా ఉన్న పాలమూరు లిఫ్ట్ను డిజైన్ను నార్లపూర్ సోర్సు నుంచి నీటిని తీసుకునేలా మార్చారన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, ఇప్పుడు కేంద్రం డీపీఆర్ను వెనక్కి పంపిందని బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఫైర్ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, పాండు రంగారెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
