నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సిటీ హష్మీనగర్ కాలనీలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు 8 తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలు, రూ.70 వేల నగదుతో ఉడాయించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తాక్ అనే వ్యక్తి పనిపై బయటకు వెళ్లగా, ఆయన భార్య ఫిర్దోసి ఒక్కతే ఇంట్లో ఉన్నారు. గడియ పెట్టని ఇంట్లోకి ఎంటరైన ముగ్గురు దొంగలు వచ్చీరాగానే ఆమెపై దాడి చేసి కొట్టారు. కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో చేతులు కట్టేశారు. ఘటనకు బెదిరిపోయిన మహిళ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు వివరాలు చెప్పగా తీసుకొని పారిపోయారు. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన భర్త పోలీస్లకు సమాచారం ఇవ్వగా, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ వచ్చి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ సేకరించింది. దొంగలను పట్టుకోడానికి స్పెషల్ టీమ్ను రంగంలోకి దింపారు.
