అశోక్ నగర్లో బీజేపీ బైక్ ర్యాలీ

అశోక్ నగర్లో బీజేపీ బైక్ ర్యాలీ

ముషీరాబాద్, వెలుగు: చాకలి ఐలమ్మను గౌరవిస్తామని గతంలో చెప్పిన టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటివరకు కనీసం ట్యాంక్ బండ్​పై ఆమె విగ్రహం కూడా పెట్టలేక పోయిందని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. విమోచన దినోత్సవంలో భాగంగా శుక్రవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అశోక్ నగర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్​తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..రైతు సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలను గౌరవించి విమోచన దినోత్సవం జరపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సమైక్య ఉత్సవాలు చేస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు సమరయోధుల త్యాగాలు తెలియాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రవి చారి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆలె భాస్కర్, సలాంద్రి శ్రీనివాస్, బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరి శివాజీ, తదితరులు పాల్గొన్నారు.