ఎంపీ vs మాజీ ఎంపీ .. ఠాణాకెక్కిన చేవెళ్ల పంచాయతీ

 ఎంపీ vs మాజీ ఎంపీ .. ఠాణాకెక్కిన చేవెళ్ల పంచాయతీ
  • రంజిత్ రెడ్డి తనను బెదిరించారని మాజీ ఎంపీ కొండా ఫిర్యాదు
  • కోర్టు అనుమతితో కేసు నమోదు చేసిన పోలీసులు
  • తన మనుషులను ఎలా కలుస్తావన్న రంజిత్
  • దమ్ముంటే తిరిగి తీసుకెళ్లాలన్న కొండా
  • మాటా మాటా పెరిగి తిట్ల దండకం?
  • రసవత్తరంగా మారిన రాజకీయం

హైదరాబాద్: చేవెళ్ల  పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.  కార్యకర్తల విషయంలో ఎంపీ, మాజీ ఎంపీ మధ్య మాటల యద్ధం కాస్తా కేసు నమోదు దాకా వెళ్లింది. బంజారాహిల్స్ లో నివసించే మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ నెల 17న ప్రస్తుత ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి కాల్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావ్.. సర్పంచులుతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ రంజిత్ రెడ్డి తనతో అసభ్యంగా మాట్లాడారని  కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీసులకు కొండా ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కొండా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు సమయంలో తనను బెదిరించిన వ్యక్తి ఎవరనేది విశ్వేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించలేదు.  పోలీసులకు ఆయన పేరు చెప్పినట్టు వివరించారు. సంస్కారంలేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. అతని పేరు చెప్పడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తులను తాను పట్టించుకోనని.. కానీ పార్టీ పెద్దల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కొండా తెలిపారు. 

ఇదేం బూతు పురాణం!

కార్యకర్తల విషయంలో ఈ నెల 17న ఎంపీ రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలో ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో.. దమ్ము ధైర్యం ఉంటే తన వాళ్లను తీసుకువెళ్లు అని కొండా దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి.. బండ బూతుల దాకా వెళ్లింది. ఇక ఇదే విషయమై పోలీసులకు కొండా కంప్లైంట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను  పోలీసులకు అందించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి, కోర్టు అనుమతి తీసుకొని ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

లోక్ సభ ఎన్నికల వేళ..

మరికొద్ది రోజుల్లోనే లోక్ సభ ఎన్నికల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ కు ముందే జరిగిన ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇరు పార్టీల మధ్య ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది.