హైదరాబాద్: శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా… వరద బాధితుల సాయంలోనూ టీఆర్ఎస్ నాయకులు కమీషన్లు దండుకున్నారన్నారు ఎంపీ రేవంత్. గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయంటూ రేవంత్ సీఎం కేసీఆర్ కు శనివారం లేఖ రాశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే… వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న టీఆర్ఎస్ నాయకుల దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారణమని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారని, అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలని, ఇప్పటి వరకు జరిగిన దోపిడీ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.లేదంటే క్షేత్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.