ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో డిసెంబర్ 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. పర్దాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్జిల్లా ఆదివాసీ భవన్లో నిర్వహించిన గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. మాజీ మంత్రి, ఎంపీ గోడం నగేశ్ను తాను స్వయంగా కలసి మద్దతు కోరతానన్నారు. కొంతమంది ఆదివాసీ యువకులు పోలీస్ శాఖకు కోవర్టులుగా మారి ఉద్యమానికి సంబంధించిన విషయాలన్నీ వారికి చెబుతున్నారన్నారు. వారిచ్చే రూ.2 వేలు, రెండు బీర్ల కోసం ఆశ పడి ఉద్యమాన్ని తాకట్టుపెట్టి జాతికి ద్రోహం చేయవద్దని సూచించారు.
ఆదివాసీల ఉద్యమాన్ని నీరుగార్చడానికి కొంతమంది ఆఫీసర్లు ఉద్యోగాలు, భూముల పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. ఆదివాసీల పట్ల ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంతమంది ఆదివాసీలకు భూములు, ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లేందుకు ఆదిలాబాద్ , హైదరాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేస్తామని ఆదివాసీలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.