ఖమ్మం, వెలుగు: పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తర్కరే అధ్యక్షత వహించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు సభ్యులు, వివిధ చమురు సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలో ప్రస్తుతం ఉన్న క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వల పరిస్థితితో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలపై సమావేశంలో సమీక్షించారు.
ధరల హెచ్చుతగ్గులు, వాటి నియంత్రణ, స్థిరీకరణ చర్యలు, కల్తీల నివారణ, ప్రమాదాల నియంత్రణ, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాలపై సభ్యులు చర్చించారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు చమురు సంస్థల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణను పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. ప్రజలకు ఇంధన సేవలు సమర్థవంతంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
