
- ముగిసిన ఎంపీటీసీల టర్మ్
- మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని కలెక్టర్లకు సర్కారు ఉత్తర్వులు
- ఎంపీడీవోపై ర్యాంక్ అధికారులకు బాధ్యతలు
- నేటితో జడ్పీటీసీల పదవీ కాలం కూడా..
- ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన సర్పంచ్ల టర్మ్
- లోకల్ బాడీల్లో మూడు కీలక వ్యవస్థలు ఖాళీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగిసింది. జడ్పీటీసీల టర్మ్ నేటితో పూర్తికానున్నది. ఈ నేపథ్యంలో మండలాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. గురువారంతో జడ్పీల టర్మ్ ముగుస్తుండడంతో.. జడ్పీలకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (లోకల్ బాడీ)ను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. దీనికి సంబంధించి గురువారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా గతంలో ఆలస్యంగా ఎన్నికలు జరిగిన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండల పరిషత్లు, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని ఒక్కో ఎంపీపీ మినహా (వాటి పదవీకాలం ముగియకపోవడంతో) అన్నింటికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువు ముగిసేలోగా కొత్త పాలకమండళ్లకు ఎన్నికలు పూర్తికాకపోవడంతో ‘ప్రత్యేక అధికారుల'ను నియమించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపీడీవోపై ర్యాంక్ అధికారులు
మండలాలకు ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవోల కంటే ఒక ర్యాంక్ ఎక్కువగా ఉన్న అధికారులను నియమిస్తూ జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమం, వెటర్నరీ, వ్యవసాయ, పరిశ్రమలు, ప్రణాళిక తదితర శాఖలకు చెందిన అధికారులను స్పెషల్ఆఫీసర్లుగా నియమించారు. మండల పరిషత్లకు ఎన్నికలు జరిగి ఎంపీటీసీ సభ్యులు ఎన్నికై, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను ఎన్నుకునే దాకా మండలాల్లో ప్రత్యేక అధికారులు కొనసాగనున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నూతన పంచాయతీరాజ్చట్టం, 2018కు అనుగుణంగా.. మండలాలకు స్పెషల్ఆఫీసర్ల నియామకానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారాన్ని కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ఇందుకు అనుగుణంగా ఎంపీడీవోలకు ఒక ర్యాంక్పైన ఉన్న... జిల్లాస్థాయి అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర జిల్లా అధికారుల (ఇంజినీర్లు మినహా)ను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని ఎంపీపీలు, మహబూబ్నగర్జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీ, నాగర్కర్నూల్జిల్లాలోని నాగర్కర్నూల్ ఎంపీపీ, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట ఎంపీపీలు మినహాయించి మిగతా మండలాల్లో స్పెషల్ఆఫీసర్లను నియమించాలని సూచించారు.
కాగా.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీల టర్మ్ కూడా పూర్తి కావడంతో లోకల్ బాడీ వ్యవస్థలో కీలకంగా ఉన్న మూడు వ్యవస్థలు ఖాళీ అవనున్నాయి.