
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్ సెమీస్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టలేదు. ఈ విరామ సమయంలో మహీ కొంతకాలం ఆర్మీలో సేవలందించాడు. తన భార్య సాక్షి, కూతురు జీవాతో ఉల్లాసంగా గడుపుతున్నాడు. అయితే ఆర్మీలో సేవ చేసేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలతో ఇప్పడు సైనికుల కోసం ఓ టీవీ షోని నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు, వాళ్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను ఇందులో తెరకెక్కించనున్నాడు. అలాగే శౌర్య చక్ర, పరమవీర చక్ర వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న వీరుల స్ఫూర్తి గాధలను కూడా ఇందులో చూపించ నున్నాడు. ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, స్టూడియో నెక్ట్స్ భాగస్వామ్యంలో ఈ షో రానుంది. ఈ సిరీస్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని క్రికెటర్ వర్గాల సమాచారం.