MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. తమ అభిమాన ఆటగాడు ఎంఎస్ ధోనీని ఈ సీజన్ చివరి హోమ్ మ్యాచ్లో మైదానంలో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఇప్పటికే కాఫ్ స్ట్రెయిన్ (కండరాల నొప్పితో) బాధపడుతున్న ధోనీ, ఇప్పుడు తాజాగా మరో గాయం బారిన పడ్డారు. దాంతో ఆయన ఈ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నైలో జరగబోయే చివరి హోమ్ మ్యాచ్కు పూర్తిగా దూరమయ్యారు.
ప్రాక్టీస్ సెషన్లో తగిలిన గాయం:
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్ సెషన్లో ధోనీ బొటనవేలికి గాయమైనట్లు తెలుస్తుంది. నిజానికి ఆయన లక్నో ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు, కానీ ఈ గాయం కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని చెన్నైలోనే ఉండిపోయారు. సోమవారం (మే 18న) జరగబోయే మ్యాచ్కు ధోనీ స్టేడియానికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కనీసం ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా కూడా ఆయన బరిలోకి దిగడం కష్టమేనని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఫ్యాన్స్ కోసం రానున్న 'తలా':
మ్యాచ్ ఆడకపోయినప్పటికీ, ధోనీ అభిమానులను నిరాశపరచడం లేదు.. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో ఈరోజు జరిగే మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలోనే వేచి ఉండాలని సీఎస్కే ఫ్రాంచైజీ ఇప్పటికే అభిమానులను కోరింది. ప్రతి సీజన్లో తమ చివరి హోమ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆటగాళ్లు మైదానం చుట్టూ తిరగడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ధోనీ మ్యాచ్ రోజుల్లో చెపాక్ స్టేడియంలో కనిపించలేదు.. కానీ, ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించే 'ల్యాప్ ఆఫ్ ఆనర్' లో పాల్గొని అభిమానులకు ధోనీ ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
►ALSO READ | SRH vs CSK మధ్య హైటెన్షన్ పోరు.. నేటి మ్యాచ్కి వర్షం ముప్పు
