SS Rajamouli: సినిమా పుట్టిన గడ్డపై జెండా పాతిన జక్కన్న.. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన స్థానం

SS Rajamouli: సినిమా పుట్టిన గడ్డపై జెండా పాతిన జక్కన్న.. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన స్థానం

ప్రపంచ సినిమా పుట్టుకకు ఫ్రాన్స్ (France) దేశం నాంది పలికింది. 1895 డిసెంబర్ 28న ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో  ‘లూమియర్ బ్రదర్స్’ (Lumière brothers) మొట్టమొదటి సారిగా సినిమాటోగ్రాఫ్ ద్వారా చలనచిత్రాలను ప్రదర్శించి, వాణిజ్యపరమైన సినిమాకు శ్రీకారం చుట్టారు. సినిమాను కేవలం ఒక వ్యాపారంగా కాకుండా గొప్ప కళారూపంగా మలచడంలో ఫ్రెంచ్ దర్శకులు ఎంతో కృషి చేశారు. అలంటి సినిమా గడ్డపై మన దర్శకధీరుడు S.S.రాజమౌళి అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్నారు.

ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ‘వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్’పై ఆయన పేరుతో ప్రత్యేక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి పేరు చేరడం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచింది.

ఈ విశేషాన్ని పంచుకుంటూ రాజమౌళి (Rajamouli) తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఉన్న లూమియర్ మ్యూజియంను సందర్శించినట్లు ఆయన తెలిపారు. అలాగే తన చిత్రాలు ఈగ, RRR హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో సందడి చేసిన స్క్రీనింగ్ హాల్‌ను చూడటం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

ఇన్‌స్టిట్యూట్ లూమియర్ డైరెక్టర్, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్లేక్షన్లో కీలక పాత్ర పోషించే థియరీ ఫ్రెమో (Thierry Frémaux), జక్కన్నను మెచ్చుకున్నారు. సినిమా పుట్టుకకు సాక్ష్యమైన చారిత్రక వీధుల్లోకి తీసుకెళ్లి పలు విశేషాలు పంచుకున్నారు.  అప్పటికే భావోద్వేగానికి లోనైన రాజమౌళికి అక్కడ మరో అద్భుతమైన సర్‌ప్రైజ్తో థియరీ ఫ్రెమో షాక్ ఇచ్చారు. 

►ALSO READ | VARANASI: బ్లాక్ ఫారెస్ట్‌లో భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం.. మహేష్‌తో జక్కన్న కొత్త స్కెచ్!

ప్రపంచ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన దర్శకుల పేర్లతో అలంకరించబడిన గోడపై మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి దిగ్గజాల పేర్ల మధ్య ఎర్రటి వస్త్రంతో కప్పబడిన మరో ఫలకాన్ని ఆయన గమనించారు. ఆ వస్త్రాన్ని తొలగించగానే తన పేరుతో కూడిన ఫలకం కనిపించడంతో క్షణం పాటు మాటలు రాలేదని రాజమౌళి తెలిపారు.

‘‘ప్రపంచ సినీ మహానుభావుల సరసన నా పేరును శాశ్వతంగా నిలిపే ఈ గౌరవానికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. కేవలం కృతజ్ఞత మాత్రమే వ్యక్తం చేయగలను. ఈ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించిన ఇన్‌స్టిట్యూట్ లూమియర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు,’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే ఫ్రాన్స్‌లోని మరో ప్రతిష్టాత్మక సినీ సంస్థ సినెమాతేక్ ఫ్రాంసేజ్ (Cinémathèque Française) కూడా రాజమౌళిని ఘనంగా సత్కరించింది. సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అక్కడ కూడా ఆయన పేరుకు శాశ్వత స్థానం కల్పించారు.

ఈ గౌరవంపై స్పందిస్తూ రాజమౌళి, ‘‘పారిస్‌లో నా చిత్రాలను ప్రదర్శించడం మాత్రమే నాకు గొప్ప గౌరవం. కానీ నేను ఊహించని విధంగా ఈ మధురమైన ఆశ్చర్యాన్ని అందించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సినీ సంస్థలలో ఒకటైన ఈ సంస్థలో నాకు శాశ్వత స్థానం దక్కడం జీవితాంతం నా హృదయంలో నిలిచిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని అన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన రాజమౌళికి లభించిన ఈ అరుదైన గౌరవంపై సినీ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు. మైథలాజీ, అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకో 80 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని సరికొత్త విజువల్ వండర్‌గా ఈ మూవీ తీర్చిదిద్దుతున్నారు జక్కన్న. నిర్మాత కె.ఎల్. నారాయణన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..