న్యూఢిల్లీ: పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ బొమ్మలు, డార్జిలింగ్ టీ, చందేరీ ఫ్యాబ్రిక్, మైసూర్ సిల్క్, కశ్మీర్ వాల్నట్ వుడ్ కార్వింగ్స్ వంటి జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ప్రొడక్టుల ప్రమోషన్ కోసం మల్టీ మీడియా క్యాంపెయిన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఒకటి, రెండు ఆడియో విజువల్ ఏజెన్సీలను నియమించాలని చూస్తోంది. తాజగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను కూడా రిలీజ్ చేసింది. బలమైన జీఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు కోసం అవసరమైన సాయాన్ని ఈ ఏజన్సీల నుంచి తీసుకోవాలని డీపీఐఐటీ భావిస్తోంది. పేరు పొందిన ఆడియో విజువల్ ఏజన్సీలను ఎంపిక చేసుకోవాలని డీపీఐఐటీ ఆలోచిస్తోంది. జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ప్రొడక్టులకు సంబంధించిన ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, స్పాన్సర్డ్ ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్, ఏవీ స్పాట్స్, షార్ట్ వీడియోల కల్పన వంటి బాధ్యతలను పై ఏజెన్సీలకు అప్పచెబుతారు.
దేశంలోని జీఐ ప్రొడక్టులకు సరయిన ప్రమోషన్, ప్రచారం లేకపోవడంతో ఈ చొరవ తీసుకుంటున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇండియాలో మొత్తం 400 దాకా ప్రొడక్టులకు జీఐ గుర్తింపు ఉంది. ఈ ప్రొడక్టులకు మరింత డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఎక్కువ మందికి వాటి గురించి తెలవాల్సి ఉందని డిపార్ట్మెంట్ పేర్కొంది. మార్కెటింగ్, బ్రాండింగ్, పబ్లిసిటీ క్యాంపెయిన్, కేటలాగింగ్ వంటి చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయని వివరించింది. ఈ–బిజినెస్ టూల్స్ వాడటం ద్వారా, వెబ్పోర్టల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమోషన్ సాధ్యపడుతుందని తెలిపింది.
జీఐ ప్రొడక్టులకు డిమాండ్ పెంచితే దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఎకానమి పుంజుకోవడమూ వీలవుతుందని డిపార్ట్మెంట్ వెల్లడించింది. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటే ప్రజలకు తొందరగా చేరువవ్వడం కుదురుతుందని, చాలా గవర్నమెంట్ ప్రాజెక్టుల సమాచారం ప్రజలకు సమర్ధంగా చేరడం లేదని డిపార్ట్మెంట్ ఈ ఆర్ఎఫ్పీ డాక్యుమెంట్లో ప్రస్తావించింది. ఆయా ప్రాంతాలలోని లోకల్ ఆర్టిజన్లే జీఐ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు పనికి వచ్చేలా మల్టీమీడియా క్యాంపెయిన్లు ఉండాలని డీపీఐఐటీ తెలిపింది. మన జీఐ ప్రొడక్టుల చుట్టూ ప్రీమియం బ్రాండ్ క్రియేట్ చేసేలా క్యాంపెయిన్లు ఉండాలని భావిస్తోంది.
దేశంలోని ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రొడక్టుకు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. అలా నిలుస్తున్న 400 జీఐ ప్రొడక్టులపైనా ఫోకస్ పెడుతున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. తయారీదారులకు మద్దతుగా నిలిచే వ్యక్తులు, సంస్థలు ఎవరైనా జీఐ ప్రొడక్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బాస్మతి రైస్, కుల్లు షాల్, కంగ్ర టీ, తంజావూర్ పెయింటింగ్స్, అలహాబాద్ సుర్ఖా, ఫరూఖాబాద్ ప్రింట్స్, లక్నో జర్దోజీ వంటి ఎన్నో జీఐ ప్రొడక్టులు దేశంలో పేరొందాయి. ఈ జీఐ ప్రొడక్టులకు ఇంటలెక్చువల్ ప్రొపర్టీ రైట్స్ కూడా వర్తింప చేస్తున్నారు. ఏదైనా ప్రొడక్టుకు జీఐ గుర్తింపు ట్యాగ్ ఇస్తే ఆ ప్రొడక్టును ఇతర వ్యక్తులు, కంపెనీలు దానిని పోలిన ప్రొడక్టులను, బ్రాండ్ను వాడటానికి వీలుండదు. ఈ జీఐ ట్యాగ్కు పదేళ్ల వ్యాలిడిటీ ఉంటోంది. ఎగుమతుల ప్రమోషన్లోనూ జీఐ ప్రొడక్టులకు పెద్ద పీట వేస్తున్నారు.