హైదరాబాద్,వెలుగు: ముంబయికి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ సిటీని టార్గెట్ చేస్తోంది. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన డ్రగ్స్పెడ్లర్ ఇఫ్తికర్ అహ్మద్ వకర్ (34) బుధవారం టాస్క్ఫోర్స్పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇఫ్తికర్ తో పాటు నెల్లూరుకు చెందిన కృష్ణకిషోర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ.3లక్షల50 వేల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ సల్మాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టబడ్డ నిందితుల నుంచి డ్రగ్స్ సప్లయ్ గ్యాంగ్స్,కస్టమర్ల వివరాలను కాల్ డేటా ఆధారంగా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు.
పబ్స్, పార్టీల దగ్గర ట్రాప్
మత్తుకు బానిసలైన యువతనే డ్రగ్స్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నాయి. లిక్కర్, గంజాయికి అలవాటు పడ్డ యువత, ఈజీమనీ కోసం చోరీలు చేసే చిల్లర దొంగలను పబ్స్,బార్స్,ఈవెంట్స్ దగ్గర డ్రగ్స్ గ్యాంగ్స్ ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సిటీలో ఇలాంటి యువత సాయంతో ముంబయి గ్యాంగ్స్ డ్రగ్స్ సప్లయ్ కు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకోసం ట్రాప్ చేసిన యువతకు మొదటిసారి తక్కువ ధరలో డ్రగ్స్ అందించి వారిని వాటిని బానిసలుగా చేస్తున్నాయి. ఆ తర్వాత లిక్కర్ ప్లేస్లో డ్రగ్స్ తీసుకునే విధంగా అలవాటు చేస్తున్నాయి. అలా వీరు టార్గెట్ చేసిన యువకులను కస్టమర్స్ నుంచి పెడ్లర్స్ గా మారుస్తున్నాయి. వీరితోనే చైన్ సిస్టమ్ లో డ్రగ్స్ సప్లయ్ చేయిస్తున్నాయి. ఇందుకోసం వారికి కమీషన్ ఆశ చూపిస్తున్నాయి. ముంబయితో పాటు గోవా నుంచి కూడా సిటీకి హెరాయిన్,కొకైన్,మెఫిడ్రొన్,చరస్,ఎండీఎంఏ డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
హెరాయిన్,ఎల్ఎస్డీకి డిమాండ్
సిటీలో ఎక్కువగా ఎల్ఎస్డీ, చరస్,హెరాయిన్,కొకైన్కు డిమాండ్ పెరిగినట్లు పోలీసుల కేస్ స్టడీస్లో తేలింది. ఫేస్బుక్,వాట్సాప్, ఇన్స్ట్రా గ్రూప్స్లో సప్లయర్స్ కస్టమర్ల నుంచి ఆర్డర్స్తీసుకుంటున్నట్లు గుర్తించారు. కోడ్ భాషతో బుకింగ్,డెలివరీ,రిసీవర్స్,సప్లయర్స్ నెట్వర్క్ను కమీషన్స్తో ఏర్పాటు చేసినట్లు ఆధారాలు సేకరించారు. నెట్వర్క్లోని పెడ్లర్స్తో గోవా,ముంబయి, బెంగళూర్ నుంచి కొరియర్, స్పెషల్ క్యారియర్లతో సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. క్యారియర్లకు ఒక్కో గ్రాము డ్రగ్కి రూ.2,500 నుంచి రూ.3వేల వరకు కమీషన్ ఇస్తున్నాయి. ఇలాంటి గ్యాంగ్స్ నుంచి డ్రగ్స్ కొన్న కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేసినా సప్లయర్స్ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. ఎక్కడా తమ డీటెయిల్స్ దొరకకుండా ఆన్ లైన్ దందా చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇప్పటికే పోలీస్ రికార్డ్స్ లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ పై ఫోకస్ పెట్టారు.