రూ.7 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత.. అన్నీ 2 వేల నోట్లే

రూ.7 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత.. అన్నీ 2 వేల నోట్లే

ముంబైలో  ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు ముద్రించి పంపిణీ చేస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి  రూ.7 కోట్ల  విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు .

పక్కా సమాచారంతో  ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  మే  -11 మంగళవారం సాయంత్రం శివారులోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద ఒక కారును అడ్డుకున్నారు. ఆ కారులో నలుగురు వ్యక్తుల నుంచి  రూ. 2000 ల నోట్లు కల్గిన 250 బండిళ్లలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.  వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురి వివరాలు చెప్పారు .

అనంతరం  పోలీసులు  సబర్బన్ అందేరిలోని ఓ హోటల్ పై దాడి చేసి ఆ మిగతా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి రూ2 కోట్ల( రూ. 2 వేలనోట్లు గల 100 కట్టలు)ను సీజ్ చేశారు. దీంతో పాటు ల్యాప్‌టాప్, ఏడు మొబైల్ ఫోన్లు, రూ.28,170 నిజమైన కరెన్సీ, ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అంతర్రాష్ట్ర ముఠా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు తేలిందని డీసీపీ సంగ్రాంసింగ్ నిషాందర్ తెలిపారు.