పల్లా.. క్షమాపణ చెప్పు ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తవా? : ముత్తిరెడ్డి

పల్లా.. క్షమాపణ చెప్పు ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తవా? : ముత్తిరెడ్డి

జనగామ, వెలుగు: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫైరయ్యారు. ‘‘కాంగ్రెస్​ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ దూరదృష్టితో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే వారిని కుక్కలతో పోలుస్తూ పల్లా రాజేశ్వర్​రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం అహంకారం” అని మండిపడ్డారు. సీఎం ప్రతిష్టను తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని,  వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 నియోజకవర్గంలోని లీడర్లకు డబ్బులు పంచి మలినం చేయొద్దన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల పెన్షన్ పెంపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముత్తిరెడ్డి మాట్లాడారు. ‘‘ఉద్యమం అంటే ఏంటో తెలియని వారు జనగామ గడ్డపైకి వస్తే ఇక్కడి జనం ఊరుకోరు. ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాపై ప్రజలకు విశ్వాసముంది. కేసీఆర్​కు జనగామలోని కుట్రలు తెలుసు. ఇక్కడి నియోజకవర్గ ప్రజల మనోభావాల మేరకు తప్పకుండా నాకే టికెట్ ఇస్తరు” అని చెప్పారు.