న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా మూడోసారి చంద్రశేఖరన్ను నియమించే ప్రక్రియ నిలిచిపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలయ్యే పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో గ్రూపులోని కొన్ని కొత్త వ్యాపారాల్లో నష్టాలు, మూలధన కేటాయింపుల వేగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై చర్చ జరగడంతో ఓటింగ్ నిర్వహించకుండా నిర్ణయాన్ని వాయిదా వేశారు. పనితీరు, గవర్నెన్స్ అంశాలపై బోర్డు సమీక్ష చేపట్టింది. గతంలో ట్రస్టులన్నీ చంద్రశేఖరన్ నియామకానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని నోయల్ టాటా ఇతర ట్రస్టీలను కోరారు.
