
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ని ‘బ్రహ్మాస్త్రం: శివ’ పేరుతో సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో టీమ్ అంతా పాల్గొంది. రాజమౌళి మాట్లాడుతూ ‘అయాన్ ముఖర్జీ కథ చెబుతుంటే నాకంటే క్రేజీగా ఉన్నాడనిపించింది. మొత్తం విన్న తర్వాత ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడనిపించింది. ‘బ్రహ్మాస్త్రం’ చాలా సందర్భాల్లో నాకు బాహుబలిని గుర్తు చేసింది. ఈ సినిమాలోని చాలా ఎలిమెంట్స్ నన్ను ఎక్సైట్ చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్తో అందర్నీ ఆకట్టుకుంటుంది’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ మూవీలో నటించడం అమేజింగ్గా అనిపించింది. ఇదొక ఎపిక్. రణ్బీర్, ఆలియాల నటన ఔట్స్టాండింగ్. కరణ్, అయాన్ల కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. ఇందులో నాది చిన్న భాగమే అయినా అందరికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పారు. ‘అమితాబ్, నాగ్ సార్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈ మూవీలో నేను పార్ట్ అవడం లక్కీగా ఫీలవుతాను’ అన్నాడు రణ్బీర్ కపూర్. ‘ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. నా కెరీర్లోనే స్పెషల్ మూవీ’ అంది ఆలియా. ‘చాలా సంవత్సరాలుగా కంటున్న కల ఈ సినిమా. ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియెన్స్ని ఇస్తుంది. రాజమౌళి గారు ఇందులో భాగమవ్వడం హ్యాపీ’ అన్నాడు అయాన్ ముఖర్జీ. కరణ్ జోహార్ మాట్లాడుతూ ‘లాంగ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. రికార్డుల్ని తిరగరాయడమే కాదు, భాషాపరమైన సరిహద్దులను కూడా చెరిపేసిన రాజమౌళి గారు ఈ సినిమాని సౌత్ లాంగ్వేజెస్లో ప్రెజెంట్ చేస్తున్నందుకు ఆయనకి థ్యాంక్స్’ అని చెప్పాడు.