నాగార్జున సాగర్​ టికెట్​ నోముల కొడుక్కే! 

నాగార్జున సాగర్​ టికెట్​ నోముల కొడుక్కే! 
  • రెండు మూడు రోజుల్లో భగత్​ పేరును ప్రకటించనున్న టీఆర్​ఎస్​
  • సెంటిమెంట్​ కలిసి వస్తుందని భావిస్తున్న పార్టీ
  • ఇన్​చార్జిగా పల్లా రాజేశ్వర్​రెడ్డికి బాధ్యతలు?

హైదరాబాద్​, వెలుగు: నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలపై టీఆర్​ఎస్​ ఫోకస్​ పెట్టింది. ఈ నెల 23న సాగర్​ బైపోల్​ షెడ్యూల్​ విడుదల కానున్న నేపథ్యంలో నోముల నర్సింహయ్య కొడుకు భగత్​ను అక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. భగత్​కు టికెట్​ ఇచ్చే విషయంపై ఇప్పటికే నల్గొండ జిల్లా లీడర్లకు టీఆర్​ఎస్​ పెద్దలు సమాచారం అందించారు. నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత సాగర్​ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక తప్పలేదు. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్​ఎస్​ భావించింది. భగత్​కు టికెట్​ ఇచ్చే విషయంపై చర్చలు జరిపింది. భగత్​తో పాటు యాదవ కులానికి చెందిన ఇతర నేతల పేర్లనూ పరిశీలించింది. నోముల కుటుంబానికి టికెట్​ఇవ్వకపోతే దుబ్బాకలో ఓ న్యాయం, సాగర్​లో మరో న్యాయమా అన్న విమర్శలు వస్తాయన్న చర్చ జరిగింది. ఆ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందో సర్వేలు కూడా చేయించింది. సాగర్​లో పార్టీపై పాజిటివ్​ ఒపీనియన్స్‌‌ ఉన్నాయని, అభ్యర్థి ఎవరైనా గెలిచే చాన్సుందని సర్వేల్లో తేలింది. దీంతో భగత్​ను బరిలోకి దింపితే సెంటిమెంట్​ కలిసి వస్తుందని భావించింది. ఈ నేపథ్యంలోనే భగత్​ అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలకు పార్టీ అధినేత కేసీఆర్​ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల బాధ్యతలను పల్లా రాజేశ్వర్​రెడ్డికి అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.