శామీర్పేట, వెలుగు: మంత్రి మల్లారెడ్డికి బీఆర్ఎస్ టికెటిస్తే మేడ్చల్లో పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా బొంరాసిపేట గ్రామంలోని తన ఫాంహౌస్లో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చీఫ్గెస్టుగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏ పార్టీలోకి వెళ్లినా కార్యకర్తలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు.
నియోజకవర్గంలో ఎక్కడ చెరువులు, కుంటలు కనిపించినా మంత్రి మల్లారెడ్డి కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మరోసారి ఆలోచించి మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి పోటీ చేయనీయకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బైరి ఈశ్వర్, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ , బోగారం మాజీ ఎంపీటీసీ హేమలత, జవహార్ నగర్ మాజీ ఎంపీటీసీ నర్సింగ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు రాములు తదితరులు పాల్గొన్నారు.