శిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

శిశు మరణాలు తగ్గించడానికి కృషి చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : శిశు మరణాలు తగ్గించడాన్ని వైద్య ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ, అనుబంధ శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ లో నల్గొండ, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించిన శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశు మరణాల విషయంలో అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఒక శిశువును కాపాడడం వల్ల ఒకరి జీవితాన్ని రక్షించిన వారమవుతామన్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు పుట్టిన తర్వాత ఏడాది వరకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షించాలని చెప్పారు.  

వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన చికిత్స 

నల్గొండ అర్బన్, వెలుగు : దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధపడే చిన్నారులు, రక్తహీనత, నరాల వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి.. ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్లను కోరారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్​లో ఈసీఐఎల్ కు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ఆర్ మేనేజర్ దుర్గాప్రసాద్​తో సమావేశ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్ గురైనవారితోపాటు మానసిక వైకల్యం, నరాల బలహీనత ఉన్న 700 మంది చిన్నారులు కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యారని తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లతోపాటు సీటీ స్కాన్, ఎంఆర్ స్కానింగ్ యంత్రాలు, అవసరమైన ఐఈసీ మెటీరియల్, చికిత్సకు సంబంధించిన సహాయం చేయాలని కోరారు.

మెడికల్ చీఫ్ ఆఫీసర్ వేణుబాబు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు వంటివి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దివ్యాంగుల అవసరాలపై ప్రతిపాదనలు రూపొందించి తమకు ఇవ్వాలని కోరారు.

అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. సమావేశంలో సీడీపీవో హరిత, జిల్లా సంక్షేమశాఖ అధికారి నాగిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.