నల్గొండ అర్బన్, వెలుగు : ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా ఆయా శాఖల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించడం పై జిల్లా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం (123) ఫిర్యాదులు రాగా, రెవిన్యూ శాఖకు (59) ఫిర్యాదులు , జిల్లా అధికారులకు(64) ఫిర్యాదులు వచ్చాయి.దివంగత శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్,పలువురు అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం.. వేసవి కార్యచరణ ప్రణాళిక కు సంబంధించి ప్రత్యేక అధికారులు వెంటనే మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.మార్చి 15 నుండి 20 మధ్యలో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న దృష్ట్యా మండలాల ప్రత్యేక అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ఉన్నారు.
