- ఫలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి
- అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- ఇప్పటికే మొదలయిన మున్సిపల్ ఎన్నికల కసరత్తు
నల్గొండ, వెలుగు: నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మారుస్తూ శాసన సభలో బిల్ పాస్ అయింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు మేరకు నల్గొండ ను కార్పొరేషన్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పుడున్న 48 వార్డులను పునర్విభజన చేసి కొత్త డివిజన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రెండు లేదా మూడు వార్డులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నల్గొండలో 48 వార్డులు ఉన్నాయి.
ఇంకో రెండు వార్డులు పెరిగితే కార్పొరేషన్గా మారిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ మున్సిపాలిటీని గ్రేడ్ పెంచి కార్పొరేషన్ చేశారు. అదే పద్ధతిలో నల్గొండను కూడా కార్పొరేషన్ స్థాయి పెంచేందుకు జనాభా లెక్కలు, వార్డుల్లో ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు.
పెరగనున్న డివిజన్లు.. మారనున్న హద్దులు
నల్గొండ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 48 వార్డులు ఉన్నాయి. ఈ 48 వార్డులను 50 డివిజన్లుగా విభజించే అవకాశం ఉంది. మొదటి 24 వార్డుల నుంచి అదనంగా ఒక డివిజన్, 24 వార్డుల నుంచి 48 వార్డుల వరకు మరో డివిజన్ కు పెంచనున్నారు. దీంతో నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అందుకోసం 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని మహానగరంగా మార్చనున్నారు.
కొత్త హద్దులతో డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. గత మున్సిపల్ఎన్నికల్లో శివారు గ్రామాలను మున్సిపా లిటీలో విలీనం చేసినందున వార్డుల సంఖ్య 48కి పెరిగింది. కానీ ఇ ప్పుడు విలీన ప్రతిపాదన తేకుండా జనాభా ఆధారంగా ఓటర్లు సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని వార్డులను పెంచుతారు. అధికారిక సమాచారం మేరకు వార్డుల్లో ఉన్న ఓటర్లలో పదిశాతం పెంచడం లేదా తగ్గించడం చేస్తారు.
ఈ పదిశాతం ఓటర్లతో కలిపి కొత్త వార్డులు క్రియేట్ చేస్తారు. కార్పొరేషన్ చట్టం ప్రకారం 50 ఉంటే సరిపోతుంది. వార్డుల్లో ఓటర్లను పదిశాతం పెంచడం లేదా తగ్గించడం చేస్తే ఎన్ని వార్డులు పెరుగుతాయనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు.
1941లో నల్గొండ మున్సిపాలిటీ..
నల్గొండ మున్సిపాలిటీ 1941లో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ మున్సిప ల్యాక్ట్ ప్రకారం 1941లో గ్రేడ్ 3లో చేర్చారు. ఆ తర్వాత 1955లో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ జాబితాలో చేరింది. హైదరాబాద్కు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న నల్గొండ పట్టణం మీదుగానే జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించారు. మహబూబ్నగర్, గుంటూరు జిల్లాల సరిహద్దులు ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే భౌగోళికంగా విశాలమైంది.
కార్పొరేషన్గా చేసేందుకు కోమటిరెడ్డి పట్టు..
నల్గొండ మున్సిపాలిటీలో ప్రస్తుతం 2,43,615 వరకు జనాభా ఉన్నట్టు అధికారుల అంచనా. దీంతో ఏ గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వీలయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను కార్పొరేషన్గా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే తాజాగా అసెంబ్లీలో నల్గొండ కార్పొరేషన్ అప్గ్రేడ్ బిల్లును ఆమోదించారు.
దీంతో నల్లగొండ మున్సిపాలిటీ వాసులతో పాటు రాజకీయ నేతల్లోనూ సరికొత్త జోష్ కన్పిస్తోంది. కౌన్సిలర్ల స్థాయి నుంచి కార్పొరేటర్లుగా మారడంతో పాటు మున్సిపల్ చైర్మన్ నుంచి మేయర్ పదవికి అప్గ్రేడ్ కానుండడంతో రాజకీయ నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం వరంగా మారనుందనే చెప్పాలి.
భారీగా రానున్న నిధులు..
నల్లగొండ కార్పొరేషన్ స్థాయికి చేరడంలో వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల నుంచి నిధులు భారీగా రానున్నాయి. భూముల ధరలు పెరుగుతాయి. ఇంటి రెంట్లు, పన్నుల రేట్లు పెరుగుతాయి. తద్వారా ఆదాయం సమకూరడంతో పాటు రియల్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు కానుండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ రానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ, సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ పెరుగుతుంది. హైదరాబాద్ కు నల్గొండ సమీపంలో ఉండడంతో ఇప్పటికే కొంత డెవలప్మెంట్ జరగ్గా ఇక మరింత స్పీడ్ గా నల్గొండ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది.
కార్పొరేషన్ గా ఏర్పాటు కావడంతో ప్రతి కాలానికి విశాలమైన రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర వసతులు మెరుగవుతాయి. ఇప్పటికే బైపాస్ రోడ్డు నిర్మాణం, లతీఫ్ సాహెబ్ గుట్టమీదకు ఘాట్రోడ్డు నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారిపోతుండగా, కార్పొరేషన్ స్థాయికి పెరిగితే పట్టణంలో మరిన్ని మౌలిక వసతులు ప్రజలకు లభిస్తాయి. వీటితో పాటు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
