పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ పేరిట మోసం.. ఒకరు అరెస్ట్

 పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ పేరిట మోసం.. ఒకరు అరెస్ట్

మిర్యాలగూడ, వెలుగు: పెట్రోల్ బంకుల్లో మెడికల్ ఎమర్జెన్సీ పేరిట స్వైపింగ్ చేసి నగదు తీసుకుని సిబ్బంది దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన అనాల శివ ఈనెల16న నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ హైవే పక్కన భారత్ పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. తన బావకు హెల్త్ బాలేదని కర్ణాటక బ్యాంక్ ఏటీఎం( డెబిట్) కార్డు ఇచ్చి మొదట రూ. 33,350, మరోసారి  ,30,250 స్వైపింగ్ చేసి నగదు తీసుకున్నాడు. అనంతరం పెట్రోల్ బంకులో రద్దీగా ఉండడంతో స్వైపింగ్( పీవోఎస్) మెషీన్ ను శివ తీసుకొని, వైడ్ ఆప్షన్ ద్వారా డబ్బులను తిరిగి అకౌంట్ లోకి  ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.

 బంకు ఓనర్ బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డి బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోగా అసలు విషయం తెలిసింది. దీంతో విజయపురి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివపై తెలంగాణ, ఏపీల్లో 33 కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి వద్ద 6 డెబిట్ కార్డులు, రూ. 2 లక్షల నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.  నాగార్జున సాగర్ సీఐ తేజావత్ శ్రీను నాయక్, ఎస్ఐ సంపత్ ఉన్నారు.