భారీగా గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు

భారీగా గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు

హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఇవ్వాళ రెండు చోట్ల అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి సుమారు రూ. 1.71 కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 1.04 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. కొత్తగూడెంలోని చుంచుపల్లిలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. లారీలో తరలిస్తున్న 20 బస్తాల గంజాయిని పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి ఏపీ మీదుగా.. రాజస్థాన్ లోని బిల్వారకు లారీలో తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 525 కేజీల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుని.. లారీని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

మరో కేసులో  రూ. 67 లక్షల విలువ చేసే గంజాయిని తరలిస్తున్న ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు పట్టుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు భారీగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే LTT ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో.. లింగంపల్లిలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలున్నారు. 24 లగేజ్ బ్యాగుల్లో తరలిస్తున్న 336 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అరకు చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి పండించే వారి నుంచి ఈ ముఠా కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ అర్బన్ రైల్వే డిఎస్పీ చంద్రభాను తెలిపారు.