జమున మృతికి ప్రముఖ నటుల నివాళులు

జమున మృతికి ప్రముఖ నటుల నివాళులు

సీనియర్ నటి జమున మృతిపై నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షులు మంచు విష్ణు నివాళులర్పించారు. గతంలో జమున నటించిన సినిమాలను గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ నివాళులర్పించారు. ‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాల్లో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా  సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే  పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా  అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్నగారు (ఎన్టీఆర్) అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ బాలకృష్ణ నివాళులర్పించారు. 

ఎంతో విచారకరం

‘సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

పౌరాణిక పాత్రకు జీవం పోశారు

జమున మృతి చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. జమున మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ సంతాపం తెలిపారు. 

మిస్ అవుతున్న

‘పిల్లలలాంటి హృదయం కలిగిన అత్యంత అందమైన మహిళల్లో జమున ఒకరు. తెలుగు చిత్రసీమలో ఒక లెజెండ్. ఆమెను ఎంతో మిస్ అవుతాను’ అంటూ మా అధ్యక్షులు మంచు విష్ణు ట్వీట్ చేశారు.