
- ముగ్గురు మైనర్ల అరెస్ట్.. జువైనల్ హోమ్ కు తరలింపు
- సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్
బషీర్ బాగ్,- వెలుగు : డ్రగ్స్ కు బానిసలుగా మారి.. జల్సాలు చేసేందుకు దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. హిమాయత్నగర్ బర్గర్ కింగ్లో పార్ట్టైం జాబ్ చేసే దినేష్ రెడ్డి ఈనెల13న తెల్లవారుజామున 4.30 గంటలకు హాస్టల్కు వెళ్తున్నాడు.
సిటీ కేఫ్ సమీపంలోని స్ట్రీట్ నం.11 వద్ద హోండా డియో బైక్ పై గుర్తు తెలియని ముగ్గురు మైనర్లు వచ్చి అతడిని అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పగా మొబైల్ అడగడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై దాడి చేసి కత్తితో బెదిరించి మొబైల్ లాక్కుని పారిపోయారు. బాధితుడు దినేష్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనాల తనిఖీల్లో భాగంగా ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. దోపిడీకి పాల్పడ్డారని నిర్ధారణ అయింది. వీరిలో ఓ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవల బొల్లారంలోనూ ముగ్గురు మైనర్లు టాటూ వేయించుకునేందుకు వెళ్లి మెషీన్ చోరీ చేసి పారిపోయారు.
పట్టుబడిన నిందితుల వద్ద హోండా యాక్టివా, టాటూ మెషీన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ముగ్గురిని జువైనల్ హోమ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.