
ముషీరాబాద్, వెలుగు : నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్(పుస్తక ప్రదర్శన) మొదలుకానుంది. జనవరి 1 వరకు 11రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో 300కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా ఢిల్లీ, కోల్కతా, మహారాష్ట్ర, కర్నాటకల్లోని పబ్లిషర్లు ఇక్కడ స్టాల్స్ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి తెలంగాణ ఒగ్గు కళారూపానికి వన్నె తెచ్చిన ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30వరకు బుక్ ఫెయిర్కొనసాగుతుందని, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లైబ్రరీలకు పుస్తకాలు అందించేందుకు ప్రత్యేకంగా బుక్ డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశారు. దేశంలో కోల్కతా తర్వాత రెండో అతి పెద్ద పుస్తక ప్రదర్శనగా రికార్డులుకెక్కిన బుక్ఫెయిర్లో ఈసారి 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.