- కరోనాతో పనులు కోల్పోయిన వారికి ఉపాధి పథకాలు
- పశుగణాభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో గొర్రెలు, పౌల్ట్రీ, పందుల పెంపకం, పశుదాణా తయారీ యూనిట్లు
- యూనిట్ కాస్ట్లో సగం బ్యాంక్ లోన్, సగం సబ్సిడీ
- అప్లై చేసుకునేందుకు ఈ నెల 15 లాస్ట్
నల్గొండ, వెలుగు : కరోనాతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ పశుగణాభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో పలు కొత్త స్కీమ్స్ను ప్రవేశపెట్టింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 4 రకాల పథకాలు అమలు చేయనున్నారు. గొర్రెలు, పందులు, కోళ్లు, పశువుల దాణా మార్కెట్ను జాతీయ స్థాయిలో పెంచడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం అని ఆఫీసర్లు చెప్పారు. ఒక్కో స్కీం కాస్ట్లో సగం బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉండగా, మరో సగాన్ని కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. గతంలో నాబార్డు నుంచి బ్యాంకుల ద్వారా అమలు చేసిన ఈ స్కీంలను ఇప్పుడు డైరెక్ట్గా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా డిజైన్ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15 లోగా ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్లో గానీ అప్లై చేసుకోవాలని నల్గొండ జిల్లా పశుగణాభివృద్ధి శాఖ ఆఫీసర్లు చెప్పారు.
స్కీంల వివరాలు
గొర్రెలు, మేకల స్కీం : ఈ యూనిట్ కాస్ట్ రూ. కోటి కాగా, ఇందులో రూ. 50 లక్షలు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలి. మరో రూ. 50 లక్షలను కేంద్ర పశుగణాభివృద్ధి సంస్థ సబ్సిడీ ఇస్తుంది. ఈ యూనిట్లో 500 గొర్రెలు, 25 పొట్టేళ్లు కొనుగోలు చేయాలి. 6 ఎకరాల సొంత స్థలం కానీ, లీజ్కు తీసుకున్న స్థలం కానీ ఉండాలి. కేంద ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మేరకు గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
పౌల్ట్రీ : యూనిట్ కాస్ట్ రూ. 50 లక్షలు కాగా, బ్యాంక్ లోన్ రూ. 25 లక్షలు, సబ్సిడీ రూ. 25 లక్షలు ఉంటుంది. ఈ స్కీంలో వెయ్యి కోళ్లను పెంచాలి. వాటి గుడ్లను పొదిగేసి ఆ పిల్లలను నాలుగు వారాల పెంచాలి. తర్వాత ఆ పిల్లలతో బిజినెస్ చేసుకోవచ్చు.
పందుల పెంపకం : యూనిట్ కాస్ట్ రూ. 60 లక్షలు. రూ. 30 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుంటే, మరో రూ. 30 లక్షలు సబ్సిడీ ఇస్తారు. లోకల్ రైతులు, లేదా ప్రభుత్వ యూనివర్సిటీలకు చెందిన ఫామ్స్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఫీడ్ అండ్ ఫాడర్ : పశువుల దాణా కొరత తీర్చేందుకు పశుగ్రాసాన్ని పెంచడం ఈ స్కీం ఉద్దేశం. ఈ స్కీం ఏపీలో బాగా పాపులర్ అయింది. కొన్ని వందల ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేస్తారు. ఆ తర్వాత దానిని ఫీడ్మిక్సింగ్ ప్లాంట్లో కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉండేలా ప్యాకింగ్ చేస్తారు. ముఖ్యంగా మొక్కజొన్న గ్రాసం పెంపకానికి ఈ యూనిట్ఉపయోగపడుతుంది. నిల్వ చేసిన గ్రాసాన్ని వేరే ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసుకోవచ్చు. యూనిట్ కాస్ట్ రూ. కోటి కాగా, రూ. 50 లక్షల సబ్సిడీ వస్తుంది.
అర్హులు వీరే...
ఈ స్కీంలకు అప్లై చేసుకోవాలనుకునే వారు సొంత భూమినైనా కలిగి ఉండాలి లేదంటే లీజుకైనా తీసుకోవాలి. మూడేళ్ల ఐటీ రిటర్న్స్ తప్పనిసరి. బ్యాంక్ కాన్సెంట్తో పాటు, వాటి వివరాలు కూడా పక్కాగా ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్టుతో పాటు, ఆ రంగంలో అనుభవం కలిగిన సర్టిఫికెట్ లేదా, ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది. http://dahd.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్స్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థలో కూడా అందుబాటులో ఉంచారు. ఈ స్కీంలను వ్యక్తిగతంగానైనా, సహకార, స్వయం సహాయక సంఘాల ద్వారానైనా, గ్రూప్గానైనా తీసుకోవచ్చని ఆఫీసర్లు తెలిపారు.