నయనతార, విఘ్నేష్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్

నయనతార, విఘ్నేష్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్

నయనతార ఫ్యాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి కూతురు కాబోతోంది. నయన్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను నయనతార జూన్ 9న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి, పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి డేట్‌, ప్లేస్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారట. తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది జూన్‌ 9వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్‌, విఘ్నేశ్‌ల వివాహం జరగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగానే పెళ్లి వేదికను బుక్‌ చేసుకునేందుకే నయన్‌, విఘ్నేశ్‌లు తిరుమల వచ్చినట్లు సమాచారం. అయితే తమ పెళ్లిపై వస్తున్న వార్తలపై నయన్‌, విఘ్నేశ్‌ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నయన్ పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇంతకుముందే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతంలో నయన్, విఘ్నేష్ లు రహస్యంగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.  సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార తమిళ్ హీరో శింభు మధ్య లవ్ ఎఫైర్ నడిచింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ భావించారు. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చేప్పేసుకున్నారు. కొన్నాళ్లకు హీరో, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవతో కూడా నయన్ రిలేషన్ షిప్ కొన్నాళ్లు నడిచింది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు డైరెక్టర్ విఘ్నేశ్‌‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఈ లేడీ సూపర్ స్టార్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోంది. 

చంద్రముఖి సినిమాతో వెండితెరకు పరిచయమైన నయనతర వరుసగా సినిమాలు చేసుకుంటూ..స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. లేడీ సూపర్ స్టార్‌గానూ మంచి పేరు తెచ్చుకుంది. 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌కు విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరు కలిసి దిగిన పలు ఫొటోలను విఘ్నేశ్‌..తరచూ ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా విఘ్నేశ్‌ దర్శకత్వం వహించిన  'కాతు వాకుల రెండు కాదల్‌' చిత్రంలో నయనతార నటించారు. విజయ్‌ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 28న విడుదలై..బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు తెలుగులో చిరంజీవి గాడ్ ఫాద‌ర్ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలుగా న‌య‌న‌తార‌ క‌నిపించ‌నుంది.