వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోడీకి చెందిన రూ. 330 కోట్ల ఆస్తులను ఈడీ బుధవారం జప్తు చేసింది. నీరవ్ మోడీకి చెందిన పలు ఆస్తులను జప్తు చేయాలని ముంబై కోర్టు జూన్ 8న తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల అనుసారం.. ముంబై, లండన్, యుఏఈలలోని ఫ్లాట్లతో సహా రూ. 330 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఈడీ గతంలో నీరవ్ మోడీకి చెందిన రూ .2,348 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
ముంబై వర్లిలోని సముద్రా మహల్ లో ఉన్న ఫ్లాట్లు, మహారాష్ట్ర అలీబాగ్లోని సీ సైడ్ ఫామ్ హౌస్, రాజస్థాన్ జైసల్మేర్లోని విండ్ మిల్లు, లండన్లోని ఒక ఫ్లాట్ మరియు యుఏఈలోని ఫ్లాట్లు ఈడీ ఈ రోజు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి.
నీరవ్ మోడీ మరియు అతని మామ మెహుల్ చోక్సీ నియంత్రణలో హాంగ్ కాంగ్ లో ఉన్న సంస్థలకు చెందిన ఆభరణాలు మరియు రత్నాలను ఈడీ గత నెలలో స్వాధీనం చేసుకుంది. వాటిలో పాలిష్ చేసిన వజ్రాలు, ముత్యాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు 1,350 కోట్ల రూపాయలు కాగా.. బరువు 2,340 కిలోలు.
గత ఏడాది డిసెంబర్ 5న ముంబై కోర్టు నీరవ్ మోడిని మరియు మెహుల్ చోక్సీని దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్థులుగా ప్రకటించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు వీరిద్దరూ 2018లో భారతదేశం నుండి పారిపోయారు.
ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్ లో జైలులో ఉన్నాడు. గత ఏడాది లండన్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అప్పటినుంచి తనను ఇండియాకు అప్పగించాలని నీరవ్ మోడీ లండన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. మరో నిందితుడు మెహుల్ చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వాలో ఉంటున్నాడు. తన ఆరోగ్యం సరిగా లేనందున ఇండియాకు రాలేకపోతున్నానని ఆయన చెబుతున్నారు.
For More News..