- డిజైన్ల ఖరారులో వాస్తు కన్సల్టంట్ ప్రమేయం
- ఇంకో రెండేండ్ల తర్వాతే హాస్పిటళ్లు
- వరంగల్ దవాఖాన 24 అంతస్తులకు కుదింపు
- ఎక్స్పర్ట్ ఇచ్చిన డిజైన్లలో మార్పులు
హైదరాబాద్, వెలుగు: కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లకు ‘వాస్తు’ దోషం పట్టుకుంది. కాలేజీలు, దవాఖాన్ల కోసం మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన డిజైన్లలో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తూ వాటి డిజైన్లను మార్పిస్తున్నారు. 8 మెడికల్ కాలేజీలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ చుట్టూ కట్టనున్న మరో మూడు ఆస్పత్రుల కోసం మెడికల్ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఆర్కిటెక్చర్లు డిజైన్లను తయారు చేశారు. వాటిని పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలో ఆర్అండ్ బీ, హెల్త్ ఆఫీసర్లు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు ఆర్కిటెక్ట్ కంపెనీలు తమ డిజైన్లను పవర్పాయింట్ ద్వారా ప్రెజెంట్ చేశాయి. డిజైన్లలో వాస్తు దోషాలు ఉన్నట్టు తేల్చి, వాస్తు ప్రకారం డిజైన్లను మార్చాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ వాస్తు కన్సల్టంట్ సుధాకర్ తేజ సూచించినట్టు తెలుస్తోంది. సైంటిఫిక్గా నిర్మించాల్సిన హాస్పిటళ్లలో, వాస్తు పేరిట మార్పులు చేయించడంపై ఆర్ అండ్ బీ, హెల్త్ ఆఫీసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటళ్లలో ల్యాబులు, డయాగ్నస్టిక్స్ వార్డ్స్కు వాస్తు కంటే సేఫ్టీ చాలా ముఖ్యమని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
నాలుగైదు నెలలైతున్నా..
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 హాస్పిటళ్లు కడ్తామని ఏడేండ్లుగా రాష్ట్ర సర్కార్ నానుస్తూనే వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత కొత్త దవాఖాన్లు, మెడికల్ కాలేజీల ప్రచారాన్ని సర్కార్ మరింత పెంచింది. అల్వాల్, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో మూడు హాస్పిటళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. అయితే నాలుగైదు నెలలు అవుతున్నా ఇప్పటిదాకా దవాఖాన్ల డిజైన్లే ఖరారు కాలేదు. వాస్తు పేరిట వాటిని ఇంకా ఆలస్యం చేస్తున్నారు. డిజైన్ల ఖరారు, టెండర్లు పూర్తయ్యేసరికే ఇంకో 3 నెలలు పట్టేలా ఉంది. నిర్మాణం మొదలుపెట్టి, అవి హాస్పిటళ్లుగా రూపుదిద్దుకునేసరికి ఇంకో రెండేండ్లు పట్టొచ్చని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీలకు ప్రస్తుతం టెంపరరీ నిర్మాణాలు చేపడుతున్నామని, రెండేండ్లు వాటిల్లోనే కాలేజీ నడిపిస్తామని అంటున్నారు.
ఎక్స్పర్ట్ ఇచ్చిన డిజైన్లలో మార్పులు
వరంగల్ హాస్పిటల్.. ‘ఏక్మినార్’
దేశంలో ఎక్కడ లేని రీతిలో కడ్తామన్న వరంగల్ హాస్పిటల్ పనులూ ఇంకా మొదలు కాలేదు. 33 అంతస్తులతో ఈ హాస్పిటల్ను కట్టబోతున్నట్టు సీఎం కేసీఆర్ జూన్లో ప్రకటించారు. దీంతో 33 అంతస్తుల హాస్పిటల్ డిజైన్ చేయాలని ఆర్కిటెక్ట్లకు సర్కార్ సూచించింది. ఎంత పెద్ద ఆస్పత్రైనా 33 అంతస్తులు అవసరం లేదని, అది సాధ్యం కాదని ఆర్కిటెక్ట్లు, హెల్త్ఎక్స్పర్ట్లు తేల్చేశారు. ఎక్కువలో ఎక్కువ 14 అంతస్తులు సరిపోతాయని సూచించారు. 33 అంతస్తులని చెప్పి 14 అంతస్తులు కడితే విమర్శలు ఎదురవుతాయని భావించిన సర్కార్.. 24 అంతస్తుల వరకూ ప్లాన్ చేయాలని ఆర్కిటెక్ట్లకు సూచించినట్టు తెలిసింది. దీంతో 14 అంతస్తుల వరకూ వెడల్పుగా, ఆ తర్వాత నుంచి వెడల్పు తగ్గిస్తూ స్థూపం తరహాలో 24 అంతస్తుల వరకూ డిజైన్లను రూపొందించినట్టు తెలిసింది. ఈ డిజైన్నూ రెండ్రోజుల క్రితం జరిగిన మీటింగ్లో ఆర్కిటెక్ట్లు చూపించారు. ఆయా డిజైన్లు ‘ఏక్ మినార్’ టైప్లో ఉన్నాయని, ఆర్ అండ్ బీ ఆఫీసర్ ఒకరు వ్యాఖ్యానించారు.
