
- రాష్ట్రంలో ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంపై ఫోకస్
- డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా సోమశిల, రామప్ప, లక్నవరం, సాగర్, అనంతగిరి హిల్స్
- అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్
- బుద్ధ గయ తరహాలో బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతం
- మీడియా సమావేశంలో వెల్లడించిన పర్యాటక మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కొత్త డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ‘‘తెలంగాణను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధాన ముసాయిదాను రూపొందించాం” అని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్ మీడియా సెంటర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
గత పదేండ్లుగా పర్యాటక రంగాన్ని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, టూరిజానికి ఒక పాలసీ అంటూ లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పుడు తాము ప్రధానంగా ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంపై దృష్టి సారించినట్లు చెప్పారు. కొత్త డ్రాఫ్ట్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిని కూడా త్వరలోనే కలిసి రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిని నిధులు కేటాయించాలని కోరతామని జూపల్లి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాల అభివృద్ధి..
కృష్ణా నది బ్యాక్ వాటర్స్ లో ఉన్న సోమశిల ప్రాంతాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్, అడ్వెంచర్ టూరిజానికి అనువైన ప్రదేశంగా గుర్తించామని మంత్రి జూపల్లి వెల్లడించారు. సోమశిలతోపాటు రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించి వివాహ వేడుకలు నిర్వహించేలా చూస్తామన్నారు.
అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నామని చెప్పారు. నాగర్జున సాగర్ లోని బుద్ధవనాన్ని బుద్ధ గయ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. తూర్పు, దక్షిణ దేశాల పర్యాటకులను అకట్టుకునేలా సౌలతులు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) సంస్థ ప్రతిష్ట మసకబారిందని మంత్రి చెప్పారు.
సంస్థలో గతంలో 800కుపైగా స్ట్రెంత్ ఉంటే.. ఇప్పుడు 200కు పడిపోయిందన్నారు. ఈ సంస్థకు తాము పూర్వ వైభవం తెస్తామన్నారు. అలా గే దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలు, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.