గ్లోబల్ కంపెనీలకూ వర్తింపు
ప్రకటనల (యాడ్స్) ఆదాయంపై ట్యాక్స్
ఈ-కామర్స్, సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలపై వడ్డింపు
డేటా అమ్మిన, పన్ను కట్టాల్సిందే
మనదేశంలోని ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్లకు (కంప్యూటర్లు) ప్రకటనలు ఇవ్వడం, వస్తువులు అమ్మడం, వీడియోలను స్ట్రీమింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే గ్లోబల్ కంపెనీల నుంచి పన్ను వసూలు చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక నిబంధన తీసుకురానుంది. ఇది అమలైతే.. ఇండియా బిజినెస్ నుంచి వచ్చే ఆదాయంపై గ్లోబల్ కంపెనీలు పన్ను కట్టాలి. ఇండియా ఇలా గ్లోబల్ ట్యాక్స్ విధిస్తుండటం ఇదే తొలిసారి. గ్లోబల్ కంపెనీలకు పన్నుల విధింపుపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవెలప్మెంట్ (ఓఈసీడీ) తయారు చేస్తున్న ఫ్రేమ్వర్క్ పూర్తయిన తరువాత మోడీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఓఈసీడీ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం అమెజాన్, అలీబాబా, ఈబే వంటి ఆన్లైన్ కంపెనీల నుంచి పన్నులు వసూలు చేస్తారు. ప్రకటనలు, స్ట్రీమింగ్ సర్వీసులు.. తదితర వ్యాపారాలు చేసే గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ కంపెనీలకూ ఈ పన్నుల వడ్డింపు ఉంటుంది. కొన్ని కంపెనీలు యూజర్ కంప్యూటర్లోని కుకీల ద్వారా సేకరించిన సమాచారాన్ని వాడుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి. ఇలాంటి సంపాదనకూ పన్ను వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మనదేశంలో 2016 నుంచే సమానత్వ సుంకం (దీనిని గూగుల్ ట్యాక్స్ అని కూడా అంటారు) వసూలు చేస్తోంది. ఈ విధానంలో ఇండియాలోని కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సంపాదిస్తున్న ఆదాయంపై ఆరుశాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇండియన్ల ద్వారా ఆదాయం సంపాదిస్తున్న విదేశాల్లోని కంపెనీల నుంచి కూడా పన్ను వసూలు చేయాలన్నది తాజా నిర్ణయం.
డిజిటల్ ఎకానమీ కోసం పన్నుల విధానం
ఇండియా మూలాలు ఉన్న విదేశీయుల నుంచి కూడా పన్నులను వసూలు చేసేందుకు ఐటీ చట్టంలో మార్పులు చేయాలని ఫైనాన్స్ బిల్లులో ప్రపోజ్ చేశారు. అయితే ఎన్ఐఆర్లు ఇండియాలో సంపాదించిన మొత్తమే ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తుందని ఐటీ చట్టంలోని తొమ్మిదో సెక్షన్ చెబుతోంది. ఇలాంటి వాళ్లు ఇక్కడి ఐపీ అడ్రస్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ద్వారా, ఇండియన్ల డేటా అమ్మడం ద్వారా సంపాదించిన మొత్తానికి పన్ను వర్తిస్తుంది. ఇండియా జాతీయుడి డేటా సాయంతో వస్తువులను, సేవలను అమ్మినా పన్ను కట్టాల్సిందే! డిజిటల్ ఎకానమీకి వర్తించాల్సిన పన్ను విధానంపై ఇప్పుడు అంతర్జాతీయ ఫోరమ్స్లోనూ చర్చ జరుగుతోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రోహింటన్ సిధ్వా అన్నారు. డిజిటల్ కంపెనీలకు విధించాల్సిన పన్నులపై అభిప్రాయాలను తెలియజేయాలని ఓఈసీడీ గత అక్టోబరులోనే ప్రజలను కోరింది.
ముఖ్యమైన విషయాలు:
ఇండియాలోని కంప్యూటర్ యూజర్కు అడ్వర్టైజ్మెంట్లు, స్ట్రీమింగ్ సర్వీసులు, వస్తువులను అమ్మిన ఇంటర్నేషనల్ కంపెనీలు పన్ను చెల్లించాలి
అమెజాన్, అలీబాబా, ఈ–బే వంటి కంపెనీలు ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటనలు, స్ట్రీమింగ్ సర్వీసులు.. తదితర వ్యాపారాలు చేసే గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ కంపెనీలకూ పన్నుల వడ్డింపు ఉంటుంది.
ఐటీ చట్టంలో ఈ మేరకు నిబంధనను చేర్చిన తరువాత గ్లోబల్ కంపెనీలపై
పన్ను వేస్తారు
ఈ విషయమై ఓఈసీడీ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ వచ్చాకే పన్నుశాతాన్ని ఖరారు చేస్తారు.