- రాత్రి కర్ఫ్యూపై గ్రేటర్ పోలీసుల ఫోకస్
- 3 కమిషనరేట్ల పరిధిలో 96 చెక్ పోస్టులు ఏర్పాటు
- రాత్రి 8 గంటల నుంచే పెట్రోలింగ్
- లోకల్ పీఎస్ల పోలీసు సిబ్బందితో సీపీల మానిటరింగ్
- రూల్స్ బ్రేక్ చేస్తే సీరియస్ యాక్షన్
హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూపై గ్రేటర్ పోలీసులు ఫోకస్ పెట్టారు. మంగళవారం నుంచి వచ్చే నెల 1న తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రివేళ్లలో సెక్యూరిటీ ఏర్పాట్లకు ప్లాన్ చేశారు. గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో నైట్ కర్ఫ్యూను పక్కాగా అమలు చేయనున్నారు. ఇందుకోసం సిటీ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేశ్భగవత్ మంగళవారం స్పెషల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. నైట్ కర్ఫ్యూ రూల్స్ ను బ్రేక్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంట ముందు నుంచే అలర్ట్
గ్రేటర్ లిమిట్స్లోని అన్ని పోలీస్స్టేషన్స్ సిబ్బందిని సీపీలు అలర్ట్ చేశారు. ప్రతి రోజు రాత్రి 8గంటల నుంచే ఆంక్షలు ఇంప్లిమెంట్ చేసేందుకు ప్లాన్ చేశారు. స్థానిక డీసీపీలు,ఏసీపీలతో నైట్కర్ఫ్యూ ను మానిటరింగ్ చేస్తున్నారు. 3 కమిషరేట్ల పరిధిలో 96 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. హోల్సేల్ మార్కెట్స్,పబ్లిక్ ప్లేసెస్లో నైట్కర్ఫ్యూపై మంగళవారం అవేర్ నెస్ కల్పించారు. ప్యాట్రో కార్, బ్లూకోల్ట్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూ టైమ్ లో ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఐడీ కార్డులు చూపిస్తే వారి ట్రావెలింగ్కు పర్మిషన్ ఇస్తున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని బారికేడ్లతో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్ పోస్టులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్యాసింజర్ల వద్ద ట్రావెల్ టికెట్ తప్పనిసరి
ట్యాంక్ బండ్, నెక్లెస్రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ హైవే,ఓఆర్ఆర్పై పోలీసులు పికెటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టు ప్యాసింజర్ల వద్ద ట్రావెల్ టికెట్ ను తప్పనిసరి చేశారు. డొమెస్టిక్ ప్యాసింజర్స్ను రిసీవ్ చేసుకునే వారిని తప్ప ఇతరులను రోడ్లపైకి అనుమతించడం లేదు. 3 కమిషనరేట్ల బోర్డర్స్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. హైవేలపై ట్రావెల్ చేసే గూడ్స్ వెహికల్స్ను నైట్కర్ఫ్యూ నుంచి మినహాయించారు. నైట్ కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేసి బయటికి వచ్చిన వెహికల్స్ ను సీజ్ చేసి టీఎస్ కాప్ యాప్లో కేసులను అప్లోడ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఐటీ ఎంప్లాయీస్ ఐడీ కార్డు చూపించాలి
జీవో ప్రకారం నైట్ కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తాం. జనం పోలీసులకు సహకరించాలి. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నం. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీసూ ఐడీ కార్డును తప్పనిసరిగా క్యారీ చేయాలి. క్యాబ్స్,ఆటోల్లో ట్రావెల్ చేసే ఎంప్లాయీస్,ఎయిర్పోర్టుకి వెళ్ళే ప్యాసింజర్స్ టికెట్స్.ఐడీ కార్డ్స్ చూపించాలి.
– సజ్జనార్, సీపీ, సైబరాబాద్
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు
రాచకొండ పరిధిలోని అన్ని ఏరియాల్లో నైట్కర్ఫ్యూను ఇంప్లిమెంట్ చేస్తాం. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై యాక్షన్ తీసుకుంటాం. ఎమర్జెన్సీ,గూడ్స్ వెహికల్స్ ట్రావెల్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి.
– మహేశ్ భగవత్, సీపీ,రాచకొండ