నా అత్యుత్తమ నిర్ణయం.. కమిటీ కుర్రోళ్లు: నిహారిక 

నా అత్యుత్తమ నిర్ణయం.. కమిటీ కుర్రోళ్లు: నిహారిక 

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి  రెండు జాతీయ అవార్డులు రావడం మనసుకు  ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు.  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  జయలక్ష్మి అడపాకతో కలిసి ఆమె నిర్మించిన ఈ సినిమా  72వ నేషనల్ అవార్డుల్లో  ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్‌‌‌‌తో పాటు  బెస్ట్ మేకప్  విభాగంలో  జాతీయ అవార్డును  సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నిహారిక మాట్లాడుతూ ‘మా చిత్రానికి  జాతీయ అవార్డులు రావడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణం.  

ఈ సినిమాను నిర్మించడం నా కెరీర్‌‌‌‌లో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఈ విజయం టీమ్  మొత్తం పడ్డ కష్టానికి దక్కిన గుర్తింపు.  మా కుటుంబం తర్వాత ఇప్పుడు నా సినిమా కూడా జాతీయ అవార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉంది’ అని  అన్నారు.  

ఈ  సినిమా జాతీయ అవార్డు గెలుస్తుందని మొదటి నుంచే నమ్మకం ఉందని  దర్శకుడు యదు వంశీ  చెప్పాడు. నిర్మాత ఫణి అడపాక,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ సహా టీమ్ అంతా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.