ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలని పిలుపు
పాట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని గురువారం పిలుపునిచ్చారు. ‘‘ప్రత్యేక హోదా అనేది బీహార్కే పరిమితం చేయం. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను గుర్తించి అన్నింటికీ స్పెషల్ స్టేటస్ ఇస్తాం” అని నితీశ్ కుమార్ అన్నారు. ‘‘ఇతర పార్టీల నుంచి ప్రజలను దూరం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో దేశమంతా చూస్తోంది. అందుకు వాళ్లు ఎలాంటి మార్గాన్ని ఉపయోగిస్తున్నారో కూడా అందరికీ తెలుసు” అని గోవాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు నితీశ్ జవాబు ఇచ్చారు. వేల కోట్లు చేతులు మారుతున్నాయని ప్రస్తావించకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేశారు.
10 లక్షల ఉద్యోగాలిస్తేనే: ప్రశాంత్ కిశోర్
ఏడాది కాలంలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని, అప్పుడే బీహార్లో నితీశ్తో లేదా కూటమితో కలిసి పని చేసే విషయం గురించి ఆలోచిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మధ్యం నిషేధ ఉద్యమం విఫలమైందని, దీనిపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మద్య నిషేధం అమలు కాగితాలకే పరిమితమైందని, విచ్చలవిడి అవినీతే దీనికి కారణమని ఆరోపించారు. తన 3,500 కిలోమీటర్ల ‘పాద-యాత్ర’లో భాగంగా.. బీహార్ను మొత్తం కవర్ చేసేందుకు నితీశ్ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. సీక్రెట్గా ఆయనను కలిసినట్టు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. రెండ్రోజుల కింద భేటీ అయ్యామని చెప్పారు. తమ కామన్ ఫ్రెండ్ పవన్ వర్మ ఈ మీటింగ్ అరేంజ్ చేశారని వెల్లడించారు. బీహార్లో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన సమస్యలను నితీశ్కు వివరించినట్టు తెలిపారు.
బీజేపీతో పొత్తు.. పొరపాటు
బీజేపీతో పొత్తు పెట్టుకుని పెద్ద పొరపాటు చేశానని, సీఎం హోదాలో ఉన్న తనను ఆ పార్టీ నేతలు అవమానించారని అన్నారు. ముఖ్య లీడర్లే బాధ్యతలేనట్లు ప్రవర్తించారని మండిపడ్డారు. స్థానిక బీజేపీ నేతలు కేంద్రం మెప్పు పొందేందుకు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. రెండ్రోజుల కింద బెగుసరాయ్ కాల్పుల ఘటనను ఉద్దేశిస్తూ.. బీహార్లో జనతా రాజ్ పోయిందని, జంగిల్ రాజ్ వచ్చిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు.