రైలులో అండర్ వేర్‌లో తిరిగిన ఎమ్మెల్యే..

రైలులో అండర్ వేర్‌లో తిరిగిన ఎమ్మెల్యే..

బీహార్: ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ ప్రజాప్రతినిధి.. రైలులో డ్రాయర్ తో తిరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీహార్ కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ గురువారం పాట్నా నుంచి ఢిల్లీకి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం చేశారు. అయితే ఆయన రైలు ప్రయాణంలో ఉండగా.. తన కంపార్ట్‌మెంట్‌ ముందు అండర్ వేర్ లో తిరుగుతూ కనిపించారు. దాంతో తోటి ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యేకు, మిగతా ప్రయాణికులకు మధ్య గొడవ కూడా జరిగింది. వెంటనే రైల్వే పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరియు టికెట్ ఎగ్జామినర్ రంగంలోకి దిగి ప్రయాణికులకు, ఎమ్మెల్యేకు సర్దిచెప్పారు.

‘ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు టికెట్ ఎగ్జామినర్ ఇరువర్గాలకు నచ్చజెప్పారు’ అని తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ తెలిపారు. కాగా.. తాను అండర్ వేర్ లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. తాను రైలులోకి ఎక్కిన తర్వాత తనకు స్టమక్ అప్ సెట్ అయ్యిందని.. అందుకే తాను అండర్ వేర్ మరియు బనియన్ లో ఉన్నానని ఆయన తెలిపారు.

కాగా.. ఎమ్మెల్యే రైలులో బనియన్ మరియు అండర్ వేర్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.