
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మృతికి గల కారణాలను సుదీర్ఘంగా పరిశీలించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)డాక్టర్లు ఇవాళ(మంగళవారం) తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయన మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తెలిపారు.
ఆయన డీఎన్ఏను పూర్తిగా పరిశీలించామని, ఆ తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని తెలిపారు ఎయిమ్స్ డాక్టర్లు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి గతంలో మహారాష్ట్ర డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ నివేదికలో తేలిన అంశాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు.
ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని డాక్టర్లు భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.