దగ్గు, సర్ది మందులు మోతాదుకు మించి వాడొద్దు.. కేంద్రం ఎందుకు ఇలా చెప్పిందంటే..

దగ్గు, సర్ది మందులు మోతాదుకు మించి వాడొద్దు.. కేంద్రం ఎందుకు ఇలా చెప్పిందంటే..

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు  రాష్ట్రాల్లో దగ్గు మందులు వికటించి చిన్నారులు మరణిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లల విషయంలో దగ్గు, జలుబు మందులను మోతాదుకు మించి వాడొద్దని స్పష్టం చేసింది. రెండేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని, ఐదేండ్లలోపు పిల్లలకు కూడా సాధారణంగా ఈ మందులను సిఫారసు చేయకూడదని సూచించింది. ఐదేండ్లు దాటిన పిల్లలకు ఇవ్వాల్సి వస్తే, డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో, అతి తక్కువ కాలం మాత్రమే  ఇవ్వాలని వెల్లడించింది. 

సాధారణంగా పిల్లలకు వచ్చే దగ్గు, జలుబు వాటంతట అవే తగ్గిపోతాయని, మందుల అవసరం ఉండకపోవచ్చని పేర్కొంది. మందులకు బదులుగా పిల్లలకు తగినంత విశ్రాంతినివ్వడం, లిక్విడ్స్  ఎక్కువగా ఇవ్వడం వంటి సహజ పద్ధతులను పాటించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఆ దగ్గు మందుల్లో ప్రమాదకర రసాయనాలు లేవు 
మధ్యప్రదేశ్‌‌లోని చింద్వారాలో కిడ్నీ సంబంధిత సమస్యలతో తొమ్మిది మంది చిన్నారులు, రాజస్థాన్‌‌లో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనలు దేశంలో తీవ్ర కలకలం రేపాయి. ఈ మరణాలకు దగ్గు మందులలోని విషపూరితర రసాయనాలే కారణమని వార్తలు వచ్చాయి. 

దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ), కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) ప్రతినిధులతో కూడిన బృందం మధ్యప్రదేశ్  వెళ్లి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా మధ్యప్రదేశ్‌‌ లో మరణించిన చిన్నారులకు సంబంధించిన దగ్గు మందు నమూనాలను పరీక్షించగా వాటిలో కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసే డైథిలిన్  గ్లైకాల్ (డీఈజీ), ఇథిలీన్  గ్లైకాల్ (ఈజీ) వంటి ప్రమాదకర రసాయనాలు లేవని తేలింది.

రాజస్థాన్‌‌లో మరణించిన ఇద్దరు చిన్నారుల కేసులో పరీక్షించిన మందు నమూనాలలో కూడా ఈ రసాయనాలు లేవని స్పష్టమైంది. అయితే, ఆ చిన్నారులకు వాడిన డెక్స్‌‌ ట్రోమెథోర్ఫాన్ ఆధారిత ఫార్ములాను పిల్లలకు వాడరాదని నిపుణులు పేర్కొన్నారు. పిల్లల మరణాలకు, దగ్గు మందులోని రసాయనాలకు ప్రత్యక్ష సంబంధం లేదని పరీక్షల్లో తేలినప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) సలహాలను జారీ చేసింది.