
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నిర్మాణానికి బాధ్యతలు తీసుకొని, నిర్మించకుండా ఉన్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని బల్దియా నిర్ణయించింది. ఆ సంస్థకు జరిమానా విధించడంతోపాటు అదే కాంట్రాక్ట్ విలువ ప్రకారంగా ఎస్టీపీలు పూర్తి చేయడానికి రెడీ అవుతోంది. సిటీ శివారులోని రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డిలోని 14 ప్రాంతాల్లో రూ.18.93 కోట్లతో ఎస్టీపీల నిర్మాణానికి గతంలో సూర్యోదయ ఇన్ఫ్రా కాంట్రాక్టు పొందింది.
అనంతరం దాదాపు 75 శాతం వరకు పనులను పూర్తి చేసి, మిగతా పనులు చేపట్టకుండా మధ్యలోనే వదిలేసింది. దీంతో ఆ సంస్థను మార్చేసి గత కాంట్రాక్టు సంస్థ కోట్చేసిన మేరకు జై శ్రీరాం ఇన్ఫ్రాకు పనులు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రానున్న స్టాండింగ్ కమిటీలో పెట్టి, ఎస్టీపీల నిర్మాణాలకు అనుమతి తీసుకోనుంది. ఎస్టీపీలు పనులు పూర్తిచేయడంతో పాటు 3 నెలలు ట్రయల్ రన్ , 9 నెలలు నిర్వహణ, కార్యకలాపాలను చేపట్టాల్సిన బాధ్యత ఈ సంస్థకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.