- అనేక అంశాల్లో ఇండియాది ఓ గెలుపుగాథ
- గాంధీ నన్ను ఎంతో ప్రభావితం చేశారు
- ‘ఏ ప్రా మిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో ఓబామా కామెంట్స్
వాషింగ్టన్: తన చిన్నతనంలో రామాయణం, మహాభారత కథలను విన్నానని అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెప్పారు. దీంతో తనకు ఇండియాపై ప్రత్యేక గౌరవం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘‘2010లో ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ఇండియాకు వెళ్లా. అంతకుముందు ఎన్నడూ వెళ్లలేదు. కానీ అప్పటికే నా ఇమాజినేషన్లో ఇండియా అంటే స్పెషల్ ప్లేస్ ఏర్పడింది. చిన్నతనంలో ఇండోనేషియాలో ఉన్నప్పుడు రామాయణ, మహాభారత కథలు విన్నందువల్ల కావచ్చు. లేదా తూర్పు దేశాల మతవిశ్వాసాలపై ఆసక్తి వల్ల కావచ్చు. లేదా కాలేజీలో ఇండియా, -పాకిస్తాన్కు చెందిన ఫ్రెండ్స్ నేర్పిన దాల్, కీమా వంటకాల వల్ల కావచ్చు’’ అని పేర్కొన్నారు. ‘ఏ ప్రామిస్డ్ల్యాండ్’ పేరిట రాసిన పుస్తకంలో ఒబామా పలు అంశాలను ప్రస్తావించారు. అనేక అంశాల్లో ఇండియాది ఓ గెలుపుగాథగా పరిగణించవచ్చని ఒబామా పేర్కొన్నారు. పొలిటికల్ పార్టీల్లో కొట్లాటలు, సాయుధ వేర్పాటువాద ఉద్యమాలు, కుంభకోణాలు ఉన్నా కూడా ఇండియా ఓ విజయవంతమైన దేశమన్నారు.
మన్మోహన్.. అభివృద్ధికి చిహ్నం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రోగ్రెస్కు చిహ్నంలాంటి వారని ఒబామా పొగిడారు. సిక్కు మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్.. అత్యున్నత పదవి చేపట్టే స్థాయికి ఎదిగారని చెప్పారు. చిన్న అవినీతి మరక కూడా లేకుండా ఎంతో కీర్తి సంపాదించుకున్నారని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా వారి అభిమానాన్ని పొందారని ప్రశంసించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న టైమ్లో ఒబామా తొలిసారి ఇండియా టూర్కు వచ్చారు.
గాంధీ.. నన్ను ప్రభావితం చేశారు..
ఇండియా అంటే ఇష్టం పెరగడానికి మహత్మా గాంధీనే కారణమని ఒబామా చెప్పారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆయన చేసిన అహిం సా పోరాటం.. అణగారిన, అట్టడుగు వర్గాలకు దారి చూపిందన్నారు. లింకన్, మండేలా, లూథర్కింగ్తో పాటు గాంధీ తన ఆలోచనల్ని ప్రభావితం చేశారని చెప్పారు.
లాడెన్పై దాడికి పాక్ సపోర్ట్ తీసుకోలే
ఒసామా బిన్లాడెన్పై దాడి చేసేందుకు పాకిస్తాన్ నుంచి సాయం తీసుకోలేదని ఒబామా తెలిపారు. పాక్మిలటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్ఖైదాతో సంబంధాలున్నాయన్నది ఓపెన్ సీక్రెట్అని, అలాంటి పాక్నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని చెప్పారు. ‘‘అబొట్టాబాద్లోని మిలటరీ కంటోన్మెంట్దగ్గర్లో లాడెన్దాక్కున్నట్లు మాకు సమాచారం వచ్చింది. మా ముందున్న రెండు అవకాశాలలో మొదటిది.. లాడెన్ఉన్న కాంపౌండ్పై ఎయిర్స్ట్రైక్ చేయడం. రెండోది.. హెలికాప్టర్ద్వారా కమాండోలు పాక్లోకి వెళ్లి, దాడి చేసి, ఆ దేశ పోలీసులు, మిలటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. మేం రెండో ఆప్షన్ ఎంచుకున్నాం. ఆపరేషన్సక్సెస్ అయ్యాక జాతీయ, అంతర్జాతీయ నేతలనుంచి ఫోన్లు వచ్చాయి. అప్పటి పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్అలీ జర్దా రీ కూడా కాల్ చేశారు” అని ఏ ప్రామిస్డ్ల్యాండ్బుక్లో ఒబామా చెప్పారు.
