- శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలం
- కొండపాక నుంచి జగదేవ్పూర్కు తరలిస్తున్నారంటూ ప్రచారం.. జేఏసీల ఆందోళనలు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చిక్కు ముళ్లు వీడటం లేదు. యంగ్ ఇండియా స్కూల్ ను 200 కోట్ల తో కొండపాక మండలంలో నిర్మించాలని నిర్ణయించడంతో ఈ ఏడాది మార్చి లో సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పర్యటన సందర్భంగా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మొదట మండల కేంద్రమైన కొండపాక సమీపంలో నిర్మించాలని భావించినా తరువాత దాన్ని బందారం గ్రామానికి మార్చారు.
ఇదే సమయంలో గజ్వేల్ నియోజవర్గంలోని జగదేవ్ పూర్ కు తరలిస్తున్నారనే ప్రచారం తెరపైకి రావడంతో దీనిపై వివాదం ఏర్పడింది. యంగ్ ఇండియా స్కూల్ ను స్థానికంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కొండపాక, జగదేవ్ పూర్ మండలాల్లో జేఎసీలు ఏర్పడటం
వివాదానికి ఆజ్యం పోసినట్టయింది.
జిల్లాకు మూడు స్కూళ్ల మంజూరు..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.200 కోట్లతో ఒక్కొ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటును ప్రారంభించగా, సిద్దిపేట జిల్లా కు మూడు మంజూరైనాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్ల పల్లికి మంజూరైన యంగ్ ఇండియా స్కూల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలానికి మరొక యంగ్ ఇండియా స్కూల్ మంజూరై శంకుస్థాపన జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఇంత వరకు స్థలమే నిర్థారించక పోవడం గమనార్హం. ఇటీవలే దుబ్బాక నియోజకవర్గానికి సైతం ఒక యంగ్ ఇండియా స్కూల్ ను మంజూరు చేసినా దాన్ని ఎక్కడ నిర్మించాలనే విషయం పెండింగ్ లో ఉంది.
స్థలాన్వేషణ లో అధికారులు..
గజ్వేల్ నియోజకవర్గం కొండపాకకు మంజూరైన యంగ్ ఇండియా స్కూల్ కోసం ఒకవైపు అధికారులు స్థలాన్వేషణలో తలమునకలయ్యారు. మొదట మండల కేంద్రానికి సమీపంలోని 22 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించడంతో వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి మార్చిలో శంకుస్థాపన చేశారు. తరువాత ఆ ప్రాంతం కొండలు గుట్టలు కావడంతో దాన్ని చదును చేయడానికి అధికంగా నిధులు వినియోగించాల్సి రావడంతో స్థలాన్ని మార్చాలని నిర్ణయించారు.
మండల పరిధిలోని బందారం వద్ద శ్రీ కృష్ణ యాదవ సంఘానికి కేటాయించిన 25 ఎకరాల అసైన్డ్ స్థలం అనువైనదిగా అధికారులు గుర్తించారు. అధికారుల అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణ యాదవ సంఘం తమకు కేటాయించిన బందారం వద్ద స్థలాన్ని యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి ఇస్తూ తీర్మాన కాపీని ఇటీవలే కలెక్టర్ కు సమర్పించారు. శ్రీ కృష్ణ యాదవ సంఘానికి ప్రత్యామ్నాయంగా వేరొక స్థలాన్ని కేటాయించడానికి రెవన్యూ అధికారులు హామీ ఇచ్చారు.
తరలింపు ప్రచారంపై ఆందోళనలు..
కొండపాకకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను జగదేవ్ పూర్ కు తరలిస్తున్నారనే ప్రచారంతో ఆందోళనలు మొదలయ్యాయి. కొండపాక నుంచి తరలించ వద్దని ఆల్ పార్టీ జేఏసీ నేతలు ఆందోళనలు ప్రారంభించగా, యంగ్ ఇండియా స్కూల్ కు అవసరమైన స్థలాన్ని ఇస్తామని తమ ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని జగదేవ్ పూర్ లో ఏర్పాటైన జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగదేవ్ పూర్ లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్థలంలో యంగ్ ఇండియా స్కూల్ ను ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు ప్రతిపాదించారు.
మండల కేంద్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి జగదేవ్ పూర్ లో యంగ్ ఇండియా స్కూల్ ను ఏర్పాటు డిమాండ్ కు మద్దతిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొండపాక జేఏసీ నేతలు తమ మండలంలోనే యంగ్ ఇండియా స్కూల్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఇప్పటికే కలెక్టర్ తో పాటు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాను కలిసి వినతి పత్రం అందజేశారు.
బందారంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు సర్వే
మండల కేంద్రమైన కొండపాక లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి స్థలం అనుకూలమైనదిగా లేకపోవడంతో ప్రత్యామ్నయ ప్రాంతాలను పరిశీలించాం. మండల పరిధిలోని బందారం వద్ద 25 ఎకరాలను యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తించి సర్వే చేశాం. దీనిపై పూర్తి స్థాయి నివేదికను త్వరలోనే కలెక్టర్ కు సమర్పిస్తాం. బందారంలోనే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం జరుగుతుంది. - మల్లికార్జున్ రెడ్డి, తహసీల్దార్, కొండపాక
