భువనేశ్వర్: ఒడిశా సీఎం, బిజు జనతాదళ్(బీజేడీ) ప్రెసిడెంట్ నవీన్ పట్నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం తొమ్మిది మంది అభ్యర్థులతో ఆయన ఐదో లిస్ట్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాను రెండు స్థానాల నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలీ స్థానంతో పాటు బోలంగీర్ జిల్లాలోని కాంతాబంజీ నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగనున్నట్టు వెల్లడించారు.
2019లో కూడా నవీన్ పట్నాయక్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హింజిలీతో పాటూ బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేయగా.. రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే, ఆ తర్వాత బిజేపూర్ స్థానానికి రాజీనామా చేసి హింజిలీ స్థానం నుంచే అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, ఒడిశాలో147 అసెంబ్లీ స్థానాలుండగా బీజేడీ 126 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.