రైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్

రైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే.. ఈ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం  35 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ.10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. వస్తువులు, లగేజీని పోగొట్టుకున్నా ఈ బీమా ద్వారా పరిహారం లభిస్తుంది.

రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు భీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10వేల వరకు అందజేస్తారు. రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. బీమాను ఎంచుకునే సమయంలో తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.    

ఇటీవల జరిగిన ఈ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లింపు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మరణించిన ప్రయాణికులకు రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు అందజేయనున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 288మంది మరణించగా, దాదాపు 11వందల మంది గాయపడ్డారు.

బీమాను క్లెయిన్ చేసే విధానం, కావాల్సిన వివరాలు

  • వీలైనంత త్వరగా బీమా కంపెనీని సంప్రదించండి.
  • మీ పేరు, తదితర వివరాలను వెల్లడించండి.
  • గాయపడిన లేదా చనిపోయిన ప్రయాణికుల పేర్లు
  • ప్రమాదం జరిగిన తేదీ, ప్రదేశం
  • రైలు నంబర్, టిక్కెట్ నంబర్
  • ప్రమాదానికి సంబంధించిన ఏవైనా వైద్య బిల్లులు, ఇతర ఖర్టులు

బీమా కంపెనీ మీ క్లెయిమ్ ను సమీక్షించి, ఏదైనా అదనపు సమాచారం కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఒక వేళ మీ క్లెయిమ్ ఆమోదించబడితే.. బీమా కంపెనీ మీకు లేదా చనిపోయిన ప్రయాణికుడి చట్టపరమైన వారసులకు చెల్లింపును జారీ చేస్తుంది.