అఫీషియల్ ప్రోగ్రామా ? పార్టీ మీటింగా?

అఫీషియల్ ప్రోగ్రామా ? పార్టీ మీటింగా?
  •     అధికారికమన్న మంత్రి హరీశ్​రావు 
  •     పార్టీ మీటింగ్​ అన్న కలెక్టర్​
  •     స్టేజీపై ఎమ్మెల్యే కొడుకు.. కింద కూర్చున్న ఆర్డీఓ వినోద్

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన వైద్యా రోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు నిర్వహించిన కార్యక్రమం అఫీషియల్ ​ప్రోగ్రామా? లేక పార్టీ మీటింగా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. శంకుస్థాపన తర్వాత నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్​రావు ..కలెక్టర్ రవిని స్టేజీపైకి రావాలని కోరారు. అప్పటికే కలెక్టర్ వెళ్లిపోయారని అక్కడే ఉన్న అధికారులు చెప్పారు.

దీంతో మంత్రి హరీశ్​రావు ..‘ఇది పార్టీ ప్రోగ్రాం అనుకొని వెళ్లిపోయారు కావచ్చు’ అని అన్నారు. తర్వాత అక్కడే స్టేజీ కింద ఓ పక్కన కూర్చున్న ఆర్డీఓ వినోద్ కుమార్ ను మాత్రం పైకి పిలవలేదు. ఎలాంటి పదవి లేని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు కల్వకుంట్ల సంజయ్ ను మాత్రం స్టేజీ పైన కూర్చోబెట్టారు. ఈ విషయమై కలెక్టర్ రవిని వివరణ కోరగా శిలాఫలకం ఆవిష్కరణ మాత్రమే అధికారిక కార్యక్రమమని అన్నారు. పబ్లిక్ మీటింగ్ అధికారికం కాదని, పార్టీ కార్యక్రమమని స్పష్టం చేశారు. కానీ మంత్రి హరీశ్ రావు మాత్రం మీటింగ్​ అఫీషియల్ అని స్పష్టం చేశారు.