- డీఈవోలకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : ‘రాజ్యాంగ పీఠికనే మార్చేశారు’ శీర్షికతో వెలుగు దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై సర్కారు స్పందించింది. టెన్త్ సోషల్ పుస్తకాల కవర్ పేజీపై సెక్యులర్, సోషలిస్టు పదాలున్న సరైన పీఠికను అతికించాలని డీఈవోలకు ఎస్సీఈఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
2023–24 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల రీడిజైన్ సమయంలో పాత పీఠికను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని ముద్రించారని ఆమె తెలిపారు. ప్రస్తుత పుస్తకాలపై ఉన్న పీఠిక స్థానంలో సోషలిస్టు, సెక్యులర్ పదాలతో కూడిన సరైన పీఠికను అతికించాలని డీఈఓలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.